Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఉత్పత్తికి ఊతం ఇచ్చేందుకు.. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానెళ్లపై విధిస్తున్న దిగుమతి సుంకాలను రద్దు చేయాలని నిర్ణయించింది. దీంతో రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లో ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల ధరలు తగ్గే అవకాశాలున్నాయి. సాధారణంగా టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్ చాలా ముఖ్యమైన భాగం. టీవీల తయారీకయ్యే మొత్తం ఖర్చులో సగానికి పైగా ఈ ప్యానెల్కే ఖర్చవుతుంది. ఇప్పుడు వీటిపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో తయారీ ఖర్చులు ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా టీవీల ధరలు కూడా దిగొచ్చే అవకాశాలున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ ప్యానళ్లపై 5శాతం దిగుమతి సుంకం ఉండేది. అయితే ఈ సుంకాలను పూర్తిగా తొలగిస్తూ కేంద్ర ఆర్థికశాఖ తాజాగా బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు ఫిల్మ్ చిప్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ), సెల్ వంటి పరికరాలపై కూడా దిగుమతి సుంకాలను ఎత్తివేసింది. ఈ పరికరాలను ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. సుంకం తగ్గింపు వల్ల రానున్న రోజుల్లో టీవీల తయారీలో కూడా వేగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.