Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆర్థిక మందగమనం నేపథ్యంలో 2024 నాటికి భారత్ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులకు భారీ స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. లక్ష్య సాధనకు గాను ఉద్యోగులకు ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించడంతో పాటు.. ప్రాజెక్టు నిర్వహణపై ప్రభుత్వ ఉద్యోగులకు సమగ్ర అవగాహన కల్పించాలని నిటి ఆయోగ్ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సర్కారుకు సిఫారసు చేసింది. ప్రభుత్వ రంగంలోని ప్రాజెక్ట్ డెలివరీలో సామర్థ్యాన్ని గరిష్టంగా పెంపొందించేందుకు గాను నిటి ఆయోగ్ ఈ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రుత్వ శాఖలు, కార్పొరేట్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములుగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన దాదాపు రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాజెక్టు మేనేజ్మెంట్పై శిక్షణ ఇవ్వాలని తాము సూచించామని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ (పీఎంఐ) గ్లోబల్ చైర్ రాండల్ టి బ్లాక్, డైరెక్టర్ తేజస్ సూరీ తెలిపారు. నిటిఆయోగ్ టాస్క్ఫోర్స్లో భాగస్వామిగా ఉన్న పీఎంఐ ఈ విషయంలో సాయం అందించేందుకు అంగీకరించిందని వారు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రతి ఏడాది దాదాపు ఏడు లక్షల మంది ప్రయివేటు రంగంలోని ప్రొఫెషనల్స్కు కూడా శిక్షణనివ్వలని నిర్ణయించినట్టుగా ఈ సంస్థ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మందగమనం నేపథ్యంలో ప్రయివేటు రంగంలోని సంస్థలు కూడా వృథాను తగ్గించుకొని, సామర్థ్యాన్ని పెంపొందించుకొనేందుకు గాను ఆసక్తి చూపుతున్నాయని.. ఈ నేపథ్యంలో వారికి కూడా శిక్షణనివ్వాలని నిర్ణయించినట్టుగా వారు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ప్రాజెక్టుల్లో వ్యయం చేసే ప్రతి డాలరుతో దాదాపు 12 శాతం వృథాగా పోతోందని.. ఇది భారత్లో మరీ ఎక్కువగా 16 శాతంగా ఉందని వారు తెలిపారు. దీనిని తగ్గించుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలుజరుగుతుందన్న అభిప్రాయాన్ని టాస్క్ఫోర్స్ వ్యక్తం చేసిందన్నారు. వృథాను తగ్గించుకోవడం ద్వారా సామర్థ్యాన్ని, ఉత్పాదకతను పెంచుకోవాలని దేశం యోచిస్తోందని టాస్క్ఫోర్స్ గుర్తించిందన్నారు. రానున్న దశాబ్ద కాలంలో దేశానికి దాదాపు 7,00,000 మంది నిపుణులైన ప్రాజెక్ట్ మేనేజర్లు అవసరమిన పీఎంఐ విశ్లేషించింది. రోడ్లు, రైల్వే, ఐటీ, తయారీ రంగాలలో ప్రాజెక్టు వ్యయం పెరిగిపోవడం వల్ల కలిగే జాప్యాల నివారణకు గాను భారీగా ఈ నిపుణుల అవసరం ఉందని తెలిపింది. ఈ నిపుణుల తయారీ వల్ల వృథా తగ్గి సామర్థ్యం పెరగడం వల్ల రానున్న రోజుల్లో దేశ ఆర్థికానికి భారీగా కలిసివస్తుందని పీఎంఐ అభిప్రాయపడింది.