Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మరోసారి వడ్డీరేట్లను సవరించింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి సమీక్షలో కీలక రెపో రేటులో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బ్యాంకు వార్షిక ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎంసీఎల్ఆర్ను తగ్గించడం ఇది ఆరోసారి కావడం విశేషం. తద్వారా గృహ రుణాలపై వడ్డీరేటు మరింతగా తగ్గే అవకాశం ఉంది.పండగ సీజన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. తాజా నిర్ణయంతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానం అయిన వడ్డీ రేట్లు పది బేసిస్ పాయింట్లు తగ్గనున్నాయి. ఎస్బీఐ కొత్తవారికి రెపోరేటు అనుసంధానిత గృహ రుణాలను అందిస్తోంది. దీనివల్ల ఆర్బీఐ బెంచ్ మార్క్ రేటును సవరించిన ప్రతిసారీ రుణ వడ్డీరేటు సైతం మారుతూ ఉంటుంది. మరోవైపు, పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా ఎస్బీఐ వడ్డీరేట్లను సవరించింది. ఇక 7 నుంచి 45 రోజుల కాల పరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 4.5 శాతానికి, 46 నుంచి 179 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 5.50 శాతానికి, 180 నుంచి సంవత్సర కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీని 5.80శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.లక్షకు పైగా పొదుపు ఖాతాలపై వడ్డీని 3.5 శాతం నుంచి 3.25శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా రేట్లు నవంబరు 1 నుంచి అమలులోకి రానున్నాయి. అలాగే వివిధ కాలపరిమితులకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను 10 నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బల్క్ డిపాజిట్లకు సైతం ఈ తగ్గింపు వర్తించనుంది. సవరించిన వడ్డీ రేట్లు అక్టోబరు 10 నుంచి అమలులోకి రానున్నాయని ఎస్బీఐ తెలిపింది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును మాత్రం అలాగే కొనసాగిస్తున్నట్టుగా బ్యాంక్ తెలిపింది.