Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలహీన సమయంలో నోట్లరద్దు, జీఎస్టీ..
- ఆ నిర్ణయాలతోనే దేశంలో మందగమనం
- ఆందోళనకరంగా పెరుగుతున్న 'ద్రవ్యలోటు'
- ప్రమాదకరపు స్థాయి దిశగా ఆర్థిక వ్యవస్థ
- ఆర్థికాంశాలలో కేంద్రీకృత నిర్ణయాలొద్దు..:ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయి దిశగా సాగుతోందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఒ.పి.జిందాల్ స్నాతకోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ద్రవ్యలోటు విఫరీతంగా పెరుగుతూ పోతోందని.. ఈ కారణంగా ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరస్థాయికి చేరుకుంటోందని ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతూ ఆర్థిక సంక్షోభం నాటి స్థాయికి చేరుకుంటోందని ఆయన అన్నారు. 2016 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధిని నమోదు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కూరుకుపోతున్నప్పటికీ భారత్ సమస్యకు అసలు కారణాలను గుర్తించలేకపోతోందని అన్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో నమోదు అవుతున్న ప్రతికూల పరిస్థితులను రానున్న రోజుల్లో పెను ప్రమాదానికి లక్షణాలుగా భావించాలని ఆయన సర్కారుకు హితవు పలికారు. కేంద్రంలోని మోడీ సర్కారు దేశ వృద్ధిరేటు పెంపుపై దృష్టి పెట్టడం మానేసి.. ప్రజా సంక్షేమం, పంపిణీ విషయాలపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తోందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగించి సర్కారుకు ఆదాయం పడిపోతున్న వేళ సంక్షేమ కార్యక్రమాలను దీర్ఘకాలం కొనసాగించలేరన్న విషయాన్ని సర్కారు గుర్తించాలని ఆయన సూచించారు.
తప్పుడు సమయంలో నోట్లరద్దు..
మోడీ సర్కారు తీసుకున్న రెండు ప్రధాన నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పేందని రాజన్ అన్నారు. నోట్ల రద్దు, దేశంలో జీఎస్టీ అమలు నిర్ణయాల కారణంగానే ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పడిపోవడం, వినియోగం తగ్గడం, ఎగుమతులు కుంటుపడడం, ఎన్బీఎఫ్సీ సంక్షోభం తదితర ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. భారత్లో కీలక నిర్ణయాలన్నీ ప్రభుత్వంలో ఏక కేంద్రంగా వెలువడుతుండడం కూడా సమస్యకు కారణంగా ఆయన అభివర్ణించారు. పెద్దపెద్ద నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా వెలువడుతున్నాయని దీంతో ఇవి తీవ్ర సమస్యాత్మకంగా మారుతున్నాయని ఆయన అన్నారు. నోటరద్దు, జీఎస్టీ వంటి ఇందుక ఉదాహరణలని అన్నారు. సర్కారు చీకట్లో నిర్ణయాలు తీసుకోవడం.. వాటి ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం ఆర్థికానికి సమస్యాత్మకంగా మారిందని ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న సమయంలో నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాలను సర్కారు ప్రకటించిందని వివరించారు. ఈ నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్రీకృత ఆర్థిక నిర్ణయాలు తగవు..
భారత ఆర్థిక వ్యవస్థ విస్తృతి పెరుగుతూ వస్తోందని.. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా కేంద్రీకృత ఆర్థిక నిర్ణయాలు ఇక పనికిరావని రాజన్ అభిప్రాయపడ్డారు. కేంద్రలోని ప్రధానియో ఇకెవరి నుంచో ఆర్థిక నిర్ణయాలు తీసుకొని వాటిని దేశంలో నేరుగా అమలు చేస్తామంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. ఇటీవల చేపట్టిన నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాల నుంచి వచ్చిన ప్రతికూల ఫలితాలే ఇందుకు తార్కాణమని ఆయన అన్నారు. సర్కారు నిర్ణయాధికారాల్లో రాజకీయాల ప్రభావం మితిమీరుతుండడంపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. బ్యాంకుల్లో మొండి బాకీలు పెరిగిపోతుండడం శోచనీయమైన విషయమని ఆయన అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో నియమాలను కఠినతరం చేయడం కూడా ఆర్థిక వ్యవస్థను పరుగుకు అవరోధంగా నిలుస్తోందని.. ఈ సమయంలో సర్కారు సరైన పంథాలో ఆర్థికానికి మేలు చేసే విధంగా ఆర్థిక వ్యవస్థకు మంచి జరిగేలా నిబంధల రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. ప్రతికూల ఫలితాలు వచ్చేంత వరకు సర్కారు మేథావులు, విశ్లేషకులు ఇచ్చే సలహాలన స్వీకరించలేని పరిస్థితి కనిపిస్తోందని.. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన అన్నారు.