Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో మందగమనంతో వృద్ధిరేటు అంతకంతకూ దిగజారిపోతున్నది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వృద్ధిరేటు అంచనాలను కుదించింది. తాజాగా, భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రపంచ బ్యాంకూ వృద్ధిరేటు అంచనాలకు కోత పెట్టింది. ఆర్బీఐ కుదించిన 6.1శాతం కంటే మరింత తక్కువగా 6 శాతానికే పరిమితం చేయడం గమనార్హం. భారత్లో ఆర్థిక మందగమనమే ఈ చర్యకు కారణమని తెలిపింది. జీఎస్టీ, నోట్లరద్దు నిర్ణయాలతోపాటు, గ్రామీణ ఆర్థికం వెనుకబాట పట్టడం, నిరుద్యోగం రికార్డుస్థాయికి చేరడంవల్ల.. ఆశించిన వేగంతో జీడీపీ వృద్ధి కావడం లేదని వివరించింది. అంతేకాదు, ప్రజల వినియోగం పడిపోవడం, దేశీయ డిమాండ్ క్షీణించడం, పెట్టుబడులు బలహీనపడటానికిగల కారణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది. కానీ, మోడీ సర్కారు ఇప్పటికీ ఆర్థిక మందగమనానికి అంగీకరించేందుకు సంకోచిస్తున్నది. మందగమనంపై ఇటీవలే ఓ విలేకరి సంధించిన ప్రశ్నను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాటవేశారు.
తారుమారవుతున్న అంచనాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 6.8శాతంగా ఉండబోతున్నట్టు ప్రపంచ బ్యాంకు ఏప్రిల్లో అంచనా వేసింది. తాజాగా, ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన సౌత్ ఆసియా ఎకనామిక్ ఫోకస్ రిపోర్టులో ఈ అంచనాలను మరింత కుదిస్తూ.. ఆరుశాతానికే పరిమితం చేసింది. ఇలా వృద్ధిరేటును తగ్గించడం ఇది వరుసగా రెండో ఏడాది కావడం గమనార్హం. 2017-18లో 7.2శాతం ఉండగా.. 2018-19లో 6.8శాతానికి కుదించింది. నేడు 2019-18 ఆర్థిక సంవత్సరానికి 6.8శాతం నుంచి 6శాతానికి పరిమితం చేసింది. అయితే, ద్రవ్య విధానాలు తగినవిధంగా అమలు చేస్తే.. వృద్ధిరేటు అంచనా 2021లో 6.9శాతం, 2022లో 7.2శాతంగా ఉండొచ్చని గణించింది. ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతంగా ఉంచాలని ఆర్బీఐ నిర్దేశించిన విషయం తెలిసిందే. కానీ, ఇది దాదాపు 3.4శాతానికి పడిపోవడంతో ఆర్బీఐ కూడా రెపోరేటులో కోత విధించక తప్పలేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు రెపో రేటులో మొత్తంగా 135 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గిం చంది. ఈ నెల మొదట్లో ఆర్బీఐ కూడా వృద్ధి రేటు అంచనాలను 6.1 శాతానికి కుదించింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గతనెలలో ఈ అంచనాలను ఏడు శాతం నుంచి 6.5శాతానికి కోత పెట్టింది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో భారత వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్టాని(ఐదు శాతం)కి చేరిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ఈ నివేదికను విడుదల చేసింది.
మన కన్నా ముందంజలో బంగ్లా, నేపాల్
భారత్ కన్నా బంగ్లాదేశ్, నేపాల్ వృద్ధిరేటు మెరుగ్గా ఉండబోతున్నట్టు వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ రెండు దేశాల్లో జీడీపీ వేగంగా వృద్ధి చెందుతుందని గణించింది. భారత్లో దేశీయ డిమాండ్ క్షీణించిందని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో తయారీరంగ వృద్ధి ఒక్క శాతం(ఒకశాతం లోపే) కూడా నమోదు కాలేదని, ఇది పదేండ్లలో కనిష్టమని పేర్కొంది. దక్షిణాసియా దేశాలు ప్రజల వినియోగం పెరిగేలా.. ఉత్తేజకర ఆర్థిక విధానాలు అమలు చేయాలనీ, పెట్టుబడులూ పెంచుకోవాలని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా రీజియన్ ఉపాధ్యక్షుడు హార్ట్విగ్ షాఫర్ తెలిపారు.