Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర అనిశ్చితిలోకొట్టుమిట్టాడుతోంది.
- సంక్షోభపు పరిస్థితులు నెలకొన్నాయి..
- ఇప్పట్లో కొలుకునే నమ్మకం కనిపించట్లేదు
- మోడీ సర్కారు వ్యవహర తీరు ఆక్షేపణీయం
- నోబెల్ అర్థశాస్త్ర పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ
కోల్కతా: అర్థశాస్త్రంలో ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్ పురస్కారానికి ఎంపికపైన ప్రవాస భారతీయుడు, ప్రముఖ ఆర్థికవేత్త్త అభిజిత్ బెనర్జీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఎకానమీ తీవ్ర అనిశ్చితిలో కొనసాగుతోందని ఆయన అన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని విశ్లేషించి చూస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గడిచిన ఆరు సంవత్సరాల పనితీరును విశ్లేషించుకొని చూస్తే.. భారత ఆర్థిక వ్యవస్థ కొంతైనా వృద్ధి కనబడుతూ వచ్చిందని... అయితే ఇటీవల వెలువడిన జీడీపీ గణాంకాలను బట్టి చూస్తే.. రానున్న రోజుల్లో ఇండియా ఆ మాత్రమైనా వృద్ధినైనా అందుకోగలదన్న నమ్మకం పోయిందనిఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ సమీప భవిష్యత్తులోనే తిరిగి కోలుకోగలదన్న నమ్మకం కనిపించడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందని ఆయన విశ్లేషించారు. 58ఏళ్ల అభిజిత్ బెనర్జీ పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో జన్మించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి హార్వర్డ్ యూనివర్శిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు.
మోడీ సర్కారు పనితీరుపై తీవ్ర అసంతృప్తి..
బెనర్జీ అమెరికాలో స్థిరపడ్డప్పటికీ.. ఆయన భారత ఆర్థిక వ్యవస్థను మొదటి నుంచి క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్నారు. మన దేశంలో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఆయన బహిరంగంగానే పాలకులకు సూచనలు చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా మోడీ సర్కారు నోట్లరద్దు చేపట్టిన సమయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. దాని ప్రభావం రానున్న రోజుల్లో ఘోరంగా ఉంటుందంటూ సర్కారును హెచ్చరించారు. నోట్లరద్దు ఉద్దేశమేంటో తనకు అర్థంకావట్టేదని.. రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2000 నోటును అందుబాటులోకి తేవడం ఉన్న వివేకమేంటో అంతుపట్టడం లేదంటూ ఆయన అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. గత వారం ఆయన బ్రౌన్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ గతంలోని యూపీఏ సర్కారు పాలనలో కంటే కూడా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఘోరంగా దిగజారిందని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం నెలకొందని అందుటే పెట్టుబడులు భారీగా పడిపోతున్నాయని.. ఎగుమతులు పెరగడం లేదని ఆయన అన్నారు. ఎకానమీలో ఎదురవుతున్న ప్రతికూలతను ఎదుర్కొనే విషయంలో మోడీ సర్కారు విభిన్నంగా వ్యవహరింస్తోందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందికరమైన సంస్థలను నిర్వహించేందుకు గాను అయితే చట్టాన్ని మార్చేయడం.. లేదా తనకు అనుకూలమైన వారిని వాటికి అధిపతులుగా నియమించుకొని వాటిని నిర్వహించడం చేస్తున్నారని అన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన హితవు పలికారు. కేంద్రంలోని ప్రధాని కార్యాలయం కీలకమైన ఆర్థిక విషయాలలో ఆనాలోచిత నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన విమర్శించారు. మోడీ ప్రభుత్వం విమర్శలను స్వీకరించే లక్షణాన్ని అలవరుచుకోవాలని ఆయన సూచించారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ భారత్లోని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అభిజిత్ పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రకటించిన న్యారుపై అభిజిత్ స్పందిస్తూ.. నిధుల సమీకరణ కోసం పన్నుల సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందని కూడా సూచించారు.