Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయంగా ఎగుమతుల్లో తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో పెట్రోలియం, ఇంజినీరింగ్, లెదర్, రసాయనాలు, రత్నాలు, అభరణాలు తదితర రంగాలలో ప్రతికూలత ఎదురవడంతో ఎగుమతులు దాదాపు 6.57 శాతం మేర పతనమై 26 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇదే సమయంలో దిగుమతులు 13.85 శాతం తగ్గి 36.89 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి. కాగా వాణిజ్య లోటు 10.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సెప్టెంబర్లో వాణిజ్య లోటు 14.95 బిలియన్ డాలర్లుగా ఉంది.గడిచిన మాసంలో ఎగుమతుల్లో కీలకమైన 30 రంగాల్లో 22 రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా రత్నాలు, అభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు వరుసగా 5.56 శాతం, 6.2 శాతం, 18.6 శాతం చొప్పున పతనమయ్యాయి. చమురు దిగుమతులు 18.33 శాతం క్షీణించి 8.98 బిలియన్ డాలర్లకు, చమురేతర దిగుమతులు 12.3 శాతం తగ్గి 27.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలో బంగారం దిగుమతులు 50.82 శాతం పతనమై 1.27 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2019-20 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలంలో ఎగుమతులు 2.39 శాతం తగ్గి 159.57 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు 7 శాతం తగ్గి 243.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.