Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవ'సాయం'లో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు..
- ఏడేండ్ల కనిష్టానికి గ్రామీణ గృహ వినియోగం
- మూడో త్రైమాసికంలో 7.3 శాతానికి ఆర్హెచ్సీ
- పకృతి వైపరీత్యాలతో పరిస్థితి ఆగమాగం
- చేతినిండా పనిలేక దుర్భర స్థితిలో రైతు కూలీలు
- పస్తులుంటున్న చేతివృత్తుల కుటుంబాలు
- కార్పొరేట్లను తప్ప.. కిసాన్లను పట్టించుకోని మోడీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రస్తుతం దేశంలో నెలకొన్న మందగమన పరిస్థితులు గ్రామీణ భారతాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలతలకు తోడు.. కేంద్రంలో మోడీ సర్కారు మొద్దునిద్ర కారణంగా పల్లె ఆర్థిక ముఖచిత్రం చెదిరిపోతోంది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు.. సర్కారు నుంచి 'మద్దతు' చర్యలు లభించకపోవడంతో గ్రామాల్లో ఉండే రైతులు చేతిలో డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మందగమన పరిస్థితల నేపథ్యంలో గ్రామీణ గృహ వినియోగం దారుణంగా పడిపోతూ వస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో గృహ వినియోగం 7.3 శాతానికి పడిపోయిందని నీల్సన్ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఇది ఏడేండ్ల కనిష్టం కావడం గమనార్హం. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో దేశంలో గృహ వినియోగం 16.2 శాతంగా నమోదు అయింది. ప్రస్తుత గణాంకాలను పరిశీలించి చూస్తే దేశంలో దీర్ఘకాలిక వ్యవసాయ సంక్షోభ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో గ్రామీణ భారతంలో ప్యాక్ చేసిన వినియోగదారు వస్తువుల వినియోగం (విలువ పరంగా) 15 శాతం మేర పడిపోయి 5 శాతానికి చేరిందని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో పట్టణ ప్రాంతంలో ఈ తరహా వినియోగం 6% మేర కుంగి 8 శాతంగా నమోదు అయింది. ఈ గణాంకాలు గ్రామీణ ప్రాంతంలో పెరుగుతున్న ప్రజల బాధలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. దేశంలోని మొత్తం ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) వ్యాపారంలో పల్లెల మార్కెట్ వాటా 36 శాతం. గత గణాంకాలను పరిశీలించి చూస్తే ఎఫ్ఎంసీజీ విభాగంలో ప్రతి ఏటా 3-5 శాతం మేర వృద్ధి నమోదు అవుతూ వస్తుంది. కానీ ఈ ఏడాది ఇది ప్రతికూల వృద్ధిని నమోదు చేయడం ఆశ్చర్యకరంగా ఉందని ఈ రంగం విశ్లేషకులు చెబుతున్నారు.
కార్పొరేట్లు తప్ప.. పేదల కనీళ్లు పట్టవా..
గ్రామీణ భారతంలో అత్యధికంగా ఉండే అన్నదాతలు తీవ్ర ఆర్థిక అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అనూహ్య వాతావరణ పరిస్థితులు, పంట వైఫల్యాలు, మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా గోస పడుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో రైతులు మద్దతు ధరను పెంచాలంటూ సర్కారును వేడుకుంటున్నారు. అయినా కేంద్రంలోని సర్కారు మొద్దునిద్ర పోతోంది. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు యత్నిస్తున్నామంటున్న మోడీ సర్కారు మన ఎకానమీ మూలాలు మరిచి.. కేవలం కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రుణాలను మాఫీ చేయడంపైనే దృష్టి సారిస్తోంది. వారిపై ఉన్న సూపర్ రిచ్, కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి చర్యలు చేపడుతోంది. అంతేగానీ నలుగురికి అన్నపెట్టే అన్నదాతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తోన్న పంటలకు మద్దతు ధరల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొనేందుకు ఈ సర్కారు చేతులు రావడం లేదు.
రైతు కూలీల పరిస్థితి దారుణం..
వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో పలువురు అన్నదాతలు సాగుకు దూరమవుతున్నారు. దీంతో కేవలం ఈ తరహా రైతులే కాకుండా.. భూమిలేని రైతు కూలీలు, వారి కుంటుంబ సభ్యులు ఆర్థికంగా ప్రభావితమవుతున్నారు. గ్రామీణ భారతంలో మూడింట రెండోంతుల కుటుంబాల వారు రైతు కూలీలుగా ఉన్నవారే కావడం విశేషం. దీంతో వీరు చేతిలో డబ్బులేక నిత్యావసరాలను కొనుక్కొవడం తప్ప.. ఇతర వినియోగంపై ఆసక్తి చూపడం లేదు. దీంతో గ్రామీణ వినియోగం అంతకంతకు పడిపోతూ వస్తోంది. మరోవైపు ఇటీవలి కాలంలో దేశంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నమోదు అవుతూ వస్తున్నాయి. దేశంలో ఒకవైపు దాదాపు 13 రాష్ట్రాల్లో వర్షాభావంతో కరువు తరహా పరిస్థితులు నెలకొనగా.. మిగతా రాష్ట్రాలలో సాధారణం కంటే ఎక్కువగా వార్షలు పడి.. వరదలొచ్చి పంటలు కొట్టుకుపోయాయి.. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆగమవతున్నారు. లక్షల రూపాయలు అప్పుతెచ్చి నారు వేస్తే.. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా తమ బతుకులు ఆగమయ్యాయని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బతుకు బండి లాగడమే కష్టంగా మారుతోందని వారు చెబుతున్నారు. దీంతో వారు కేవలం రోజుగడుపుకునేందుకు అవసరమైన వ్యయం మాత్రమే చేస్తూ వస్తున్నారు. . ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలలో అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు నాలుగో వంతుకు పడిపోయాయి. దీనికి తోడు ఎగుమతులు పడిపోవడంతో టెక్స్టైల్స్ పరిశ్రమలూ కునారిల్లుతున్నాయి. ఫలితంగా ఇక్కడ పని చేసే కూలీలకూ ఉపాధి లేకుండా పోయింది. మరోవైపు గ్రామీణ జీవితానికి అయువుపట్టులా నిలిచే వ్యవసాయం కుంటుపడడం, మందగమన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కనిపించకపోవడంతో చాలా గ్రామీల్లో ఇతర చేతి వృత్తుల వారు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.
పట్టించుకోని మోడీ సర్కారు: ఏచూరి
దేశంలో నెలకొన్న మందగమనం అంతకంతకు తీవ్రతరమవుతున్నప్పటికీ పరిస్థితిని చక్కదిద్దే దిశగా కేంద్రంలోని మోడీ సర్కారు ఎలాంటి బలమైన చర్యలను చేపట్టడం లేదని సీపీఐ(ఐ) జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో ప్రజలు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల జీవన పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన ద్యాసనంతటినీ కార్పొరేట్ సంస్థల రుణాల రద్దు, దేశంలోని కుబేరులపై విధిస్తున్న పన్ను భారాన్ని తగ్గిచడంపైనే చూపుతూ పని చేస్తోందని ఏచూరీ దుయ్యబట్టారు. గ్రామీణ భారతంలో వ్యవసాయ క్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయని.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ఆయినా సర్కారు ఈ దిశగా దృష్టి పెట్టకపోవడం శోచనీయమని అన్నారు. గత కొన్ని సంవత్సరాలు గ్రామీణుల ఆదాయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందన్నారు. దీంతో పల్లెలు తీవ్ర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. దేశంలోని అత్యధిక వర్గం ప్రజలు క్షోభ పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పరిస్థితిని చక్కదిద్దే దిశగా మోడీ సర్కారు పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టకపోవడం చూస్తుంటే సామాన్యుల మేలు పట్ల సర్కారుకు ఎంత దక్షత ఉందన్న విషయం తెలుస్తోందని అన్నారు. మోడీ సర్కారు విధానాలతో సమాజంలోని అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.