Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత్లో ప్రస్తుతం నెలకొన్న మందగమన పరిస్థితులు క్రమంగా ఆర్థిక వ్యవస్థను మాంద్యం దిశగా తీసుకుపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్న వేళ రానున్న ఆరు నెలలు నుంచి ఏడాదిన్నర కాలంలో భారత్ మాంద్యంలోకి జారుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈసారి భారత్లో సంభవించే మాంద్యం.. 2008లో సంభవించిన మాంద్యం కంటే కూడా తీవ్రమైనదిగా ఉండనున్నట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ద్రవ్యలోటు అంతకంతకు పడిపోతుండడం, పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతి కుంటుపడడంతో పాటు ఉపాధి అవకాశాలు పడిపోతూ వినియోగం తగ్గుతున్న వేళ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం పరిస్థితులు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయని వారంటున్నారు. భారత్లో గతంతో పోలిస్తే ఈసారి వినిమయ సామర్థ్యం దారుణంగా పడిపోయిందని.. ఈ నేపథ్యంలో మాంద్యం ప్రభావం భారీగానే కనిపించే అవకాశం ఉందని వారంటున్నారు. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ గోల్డ్మన్స్ శాక్స్ కూడా తాజాగా ఇదే తరహా ఆందోళనను వ్యక్తం చేసింది. ఈసారి సంభవించే మాంద్యం 2008లో సంభవించిన ఆర్థిక మాంద్యం కంటే తీవ్రమైందని ఈ సంస్థ విశ్లేషించింది. దేశీయంగా డిమాండ్ పడిపోవడమనే విషయం చాలా తీవ్రమైన అంశమని విశ్లేషకులు అంటున్నారు. 2008లో ఏర్పడిన మాంద్యం ప్రపంచ దేశాలను విశేషంగా ప్రభావితం చేసినప్పటికీ.. దేశీయ డిమాండ్, వినిమయం ఆ భయకర పరిస్థితుల నుంచి భారత్ను కాపాడిందని వారు అంటున్నారు. అయితే ఈ సారి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు అండగా ఉంటూ వచ్చిన దేశీయ వినియోగం పడిపోవడం వల్ల రానున్న రోజుల్లో ఆర్థిక కష్టాలు తప్పకపోవచ్చన్నది వారంటున్నారు. ప్రస్తుత ఈ ఆర్థిక ఇబ్బందులకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల సంక్షోభం వాస్తవ కారణం కాదని రేటింగ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. వినిమయంలో ఏర్పడిన మందగమనం.. ఎన్బీఎఫ్సీల సంక్షోభం వల్లేనని చాలామంది అంటున్నా రని, అందులో ఎంతమాత్రం కూడా నిజం లేదని గోల్డ్మన్ శాక్స్ ముఖ్య ఆర్థికవేత్త ప్రాచీ మిశ్రా అన్నారు. ఎన్బీఎఫ్సీ సంక్షోభానికి కారణమైన ఐఎల్అండ్ఎఫ్ఎస్ గతేడాది ఆగస్టు-సెప్టెంబర్లో దివాలా తీసిందని, కానీ 2017 జనవరి నుంచే దేశంలో వినియోగ సామర్థ్యం పడిపోతూ వస్తోందని అన్నారు. ఎన్బీఎఫ్సీలకు బ్యాంకుల నుంచి రుణాలు తదితర ఆర్థిక సాయం ఆగిపోవడమే దీనికి ప్రధాన కారణమన్నారు. దేశ జీడీపీ పతనంలో మూడో వంతు వాటా దిగజారిన వినిమయానిదేనని మిశ్రా అన్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులూ భారత వద్ధిరేటు క్షీణతకు కారణంగా నిలిచాయన్నారు. ఈ నేపథ్యంలో సర్కారు ఇకనైనా కోలుకొని సప్లయివైపు దృష్టి సారిచడం కాకుండా.. దేశంలో ప్రజల వినియోగం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని రేటింగ్ సంస్థలు చెబుతున్నాయి.