Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నెగిటీవ్' రేటింగ్ ఇచ్చిన మూడీస్
- ఆర్థికవృద్ధి మరింత క్షీణించే ప్రమాదముందని హెచ్చరిక
న్యూఢిల్లీ : గతంతో పోల్చితే భారత ఆర్థిక వృద్ధి మరింత పతనమయ్యే ప్రమాదముందని 'మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్' తాజా నివేదిక అంచనావేసింది. భారత్ రేటింగ్ అవుట్లుక్ను 'స్టేబుల్' (స్థిరమైనది) నుంచి 'నెగిటీవ్'(తిరోగమనం)కు తగ్గించింది. పెట్టుబడులకు సంబంధించి భారత్ క్రెడిట్ రేటింగ్ 'బీఏఏ2' (లోయర్ మిడిల్ గ్రేడ్)గా ఉందని నివేదిక పేర్కొన్నది. జీడీపీ వృద్ధిలో పెద్దగా మార్పు ఉండబోదు కాబట్టి...భారత్లో సెక్యూరిటీలు, బాండ్ల కొనుగోలు సురక్షితం కాదని ఈ రేటింగ్ ద్వారా 'మూడీస్' చెప్పదల్చుకుంది.
వాణిజ్య పెట్టుబడులు పెంచే, వృద్ధిని పరుగులు పెట్టించే అవకాశాలు తగ్గిపోయాయనీ, వివిధ నివేదికలు, ఇతర సమాచారాన్ని బట్టి... పెట్టుబడులకు మరింత వేచిచూసే ధోరణి ఉంటుందనీ నివేదిక అభిప్రాయపడింది. తాజా రేటింగ్ నేపథ్యంలో మూడీస్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ఇలా ఉంది...
''ఆర్థిక, సంస్థాగత బలహీనతల్ని పరిష్కరించడంలో మూడీస్ అంచనా వేసినదానికంటే కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తోంది. గతంతో పోలిస్తే ఆర్థికవృద్ధి మరింత క్షీణించే ప్రమాదముంది. ఇదిలాగే కొనసాగితే ఇప్పటికే తీవ్రస్థాయికి చేరుకున్న అప్పులభారం మరింత పెరిగే అవకాశముంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థలో నెలకొన్న ఒడుదొడుకులు, ఉపాధి కల్పన దెబ్బతినటం, బ్యాంకింగేతర రంగాల్లో సంక్షోభం...పరిష్కరించే దిశగా ప్రభుత్వం కార్యచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది'' అని పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం, రుణభారం నేపథ్యంలో మూడీస్ రేటింగ్స్ తగ్గిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ద్రవ్యలోటు పెరగనుంది!
ఆర్థికవ్యవస్థకు పొంచిఉన్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని భారత క్రెడిట్ రేటింగ్ను తగ్గించామని 'మూడీస్' తెలిపింది. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా దేశ వృద్ధి రేటు కనిష్టానికి పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ లక్ష్యానికి(3.3 శాతం) భిన్నంగా 2020 నాటికి జీడీపీలో 3.7శాతం లోటు బడ్జెట్కు కేటాయించబోతున్నట్టు మూడీస్ అంచనా వేసింది. దీర్ఘకాలికంగా ఆర్థిక మందగమనం కొనసాగటం ఆదాయాల తగ్గుదలతో పాటు మెరుగైన జీవన ప్రమాణాలు పొందలేరని, తద్వారా పెట్టబడులకు విఘాతం కలుగుతుందని మూడీస్ గ్రూప్ ఉపాధ్యక్షుడు విలియమ్ ఫోస్టర్ తెలిపారు. వినియాగదారుల రుణాలు తీర్చడంలో ప్రధాన వనరుగా ఉన్న బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలలో సమస్యలు అంత త్వరగా తీరబోవని మూడీస్ తెలిపింది.