Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరోక్షంగా వెల్లడించిన ఎన్ఎస్వో సర్వే
- 40 ఏండ్లలో తొలిసారి కుంగిన భారతీయుల నెలవారీ తలసరి ఖర్చు
- గ్రామీణ భారతంలో భారీగా తగ్గిన ఖర్చు స్థోమత
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న తీవ్ర అనిశ్చిత పరిస్థితుల కారణంగా ప్రజల తలసరి వ్యయం అంతకంతకు పడిపోతూ వస్తోంది. జాతీయ గణాంకాల కార్యాల యం (ఎన్ఎస్వో) తాజాగా
రూపొందించిన నివేదిక ప్రకారం 2017-19లో భారతీయుల నెలవారీ తలసరి వ్యయం.. గత 40 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది. ప్రధానంగా గ్రామీణ భారతపు వ్యయం పడిపోవడమే ఈ పరిస్థితికి కారణమని నివేదిక అభిప్రాయపడింది. 'హౌస్హోల్డ్ కన్జూమర్ ఎక్స్పెన్డీచర్ ఇన్ ఇండియా' పేరుతో ఎన్ఎస్వో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. 2017-18 సంవత్సరంలో భారతీయుల తలసరి నెల సగటు ఖర్చు రూ.1,446లకు పడిపోయింది. అంతకు ముందు 2011-12లో ఇది రూ.1,501గా నిలిచింది. అంటే భారతీయుల నెల తలసరి వ్యయం 3.7 శాతం మేర పడిపోయినట్టుగా నివేదిక తేల్చిందని ఒక ప్రముఖ ఆంగ్ల వార్తపత్రిక తన కథనంలో పేర్కొంది. నెలవారీ తలసరి వినియోగ వ్యయానికి (ఎంపీసీఈ) సంబంధించిన నివేదికలు రూపొందించడానికి 2009-10ను ఆధార సంవత్సరంగా తీసుకున్నట్టుగా ఎన్ఎస్వో రిపోర్టులో ఉంది. ఈ నివేదిక ప్రకారం 2017-18లో గ్రామీణ భారతీయుల తలసరి వ్యయం 8.8 శాతం మేర పడిపోయింది. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల ప్రజల వ్యయంలో 2 శాతం వృద్ధి కనిపించడం విశేషం. ఎన్ఎస్వో నివేదికలను విశ్లేషిస్తే 1972-73 తరువాత భారత్లో తలసరి వినియోగ వ్యయం పడిపోవడం ఇదే తొలిసారని జేఎన్యూ విశ్వవిద్యాలయం అర్థశాస్త్రం విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ హిమాన్షూ తెలిపారు. అంతకు ముందు 1960లో ఏర్పడిన ఆహార సంక్షభ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇలాగే భారతీయుల తలసరి వ్యయం బాగా పడిపోయినట్టుగా ఆయన వివరించారు. ఇది దేశంలో పేదరికం పెరిగిందనడానికి నిదర్శనమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేను జులై, 2017 నుంచి జూన్, 2018 మధ్య కాలంలో నిర్వహించారు. అంటే మోడీ ప్రభుత్వం దేశంలో పెద్ద నోట్ల రద్దు చేపట్టడంతో పాటు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని అమలులోకి తెచ్చిన తొలినాళ్లలో చేపట్టారు. సర్వే నివేదికకు ఎన్ఎస్వో కమిటీ ఈ ఏడాది జూన్ 12న ఆమోదం తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో లోపాలను వెల్లడించే పలు అంశాలు ఈ నివేదికలో దాగి ఉన్నందున ఎన్ఎస్వో అధికారులు ఈ నివేదికను బయటకు వెల్లడించకుండా పక్కనబెట్టినట్టుగా తెలుస్తోంది.
ఎన్ఎస్వో నివేదిక ప్రకారం గ్రామీణ భారతంలో తలసరి ఆహారానికి చేసే వ్యయం దాదాపు 10 శాతం మేర తగ్గింది. ఇది కొంత ఆందోళనకర అంశమని నివేదిక పేర్కొంది. దీనిని బట్టి చూస్తే దేశంలో పోషకాహార లోపం తీవ్రతరమవుతోందన్న విషయం స్పష్టమవుతోందని నిపుణలు అంటున్నారు. తాజా నివేదిక ప్రకారం గ్రామీణ భారతంలో ఇండియన్స్ సగటున ఆహారంపై ఖర్చు చేస్తున్న మొత్తం రూ.580లుగా నిలిచిందని నివేదిక తెలిపింది. 2011-12లో ఇది రూ.643 దరిదాపుల్లో ఉంది. అంటే భారతంలో ఆహార వినియోగ వ్యయం దాదాపు 10 శాతం మేర తగ్గినట్టయిందని కథనం తెలిపింది. ఫలితంగా దేశంలో పోషకాహర లోపం పెరుగుతోందని చెప్పొచ్చని విశ్లేషకులంటున్నారు. దీంతో దేశంలో పేదరికం గణనీయంగా పెరిగిందని కూడా సూత్రీకరించవచ్చని ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు అభిజిత్ సేన్ తెలిపారు.