Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్జెన్కో లోగుట్టు
- గందరగోళంలో వీక్షకులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''టీఎస్జెన్కోలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నందుకు గుర్తింపుగా సీఎస్ఐ ఎస్ఐజీ ఈ-గవర్నెన్స్ అవార్డ్ ఆఫ్ ఎక్స్లెన్స్ లభించింది. భువనేశ్వర్లో జరిగిన కార్యక్రమంలో టీఎస్జెన్కో అధికారులు ఈ అవార్డును అందుకున్నారు. ఐటీ విభాగం ఉద్యోగులను అభినందించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో వాడుకుంటూ, పారదర్శకంగా వ్యవహరిస్తున్నందునే ఈ అవార్డు లభించిందంటూ ఉన్నతాధికారులు ఓ పత్రికా ప్రకటనను కూడా విడుదల చేశారు''ఇక్కడికి సీన్ కట్ చేస్తే....విద్యుత్ సంస్థల పారదర్శకతలో డొల్లతనం, సమాచార గోప్యత, వాస్తవ స్థితిగతులపై బెరుకుతనం టీఎస్ జెన్కో వెబ్సైట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వెబ్సైట్ను గడచిన ఐదేండ్లుగా అప్డేట్ చేయలేదు. పారదర్శకంగా ఉండాల్సిన సమాచారమూ లేదు. అన్నింటా గోప్యతే. తమకు అనుకూలమైన కాలమ్స్ను మాత్రమే అప్డేట్ చేసి, తమకు ఇబ్బందులు వస్తాయని భావించే కాలమ్స్ను అలాగే వదిలేశారు. కార్పొరేట్ సంస్థల నుంచి తీసుకున్న అవార్డుల ఫోటోలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రొఫైల్స్ను మాత్రం ఆప్డేట్ చేశారు. జనరేటింగ్ స్టేషన్స్ లోకేషన్ మ్యాప్స్లోనూ తప్పులు ఉన్నాయి. నిర్మాణమే పూర్తికాని థర్మల్ కేంద్రాలను...ఇప్పటికే పూర్తయిన థర్మల్ కేంద్రాలతో కలిపేసి వెబ్సైట్లో చూపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి పవర్ స్టేషన్ (4ఞ270ొ1080 మెగావాట్లు), నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (5ఞ800ొ4000 మెగావాట్లు) నిర్మాణ పనులే పూర్తికాలేదు. కానీ వీటిని ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న విద్యుత్కేంద్రాల జాబితాలో చేర్చేశారు. మొత్తం ఏడు థర్మల్ కేంద్రాల జాబితాలో పూర్తయినవి ఎన్ని...ప్రారంభదశలో ఉన్నవి ఎన్ని...పని పురోగతిలో ఉన్నవి ఎన్ని..అనే వివరాలు మాత్రం లేవు. కేటీపీఎస్-7 స్టేజ్లో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యి, ఉత్పత్తి కూడా ప్రారంభించింది. (ప్రస్తుతం మరమ్మతుల పేరుతో మూసి ఉంచారు) ఆ జాబితాలోనే భద్రాద్రి, యాదాద్రిని చేర్చారు. ఇది వెబ్సైట్ వీక్షకుల్ని గందరగోళపర్చడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. పెరఫార్మెన్స్ ఆపరేషనల్ కాలమ్లో 2018 ఆగస్టు 1 నాటి సమాచారాన్ని ఉంచారు. అప్పటి నుంచి అప్డేట్ జరగలేదు. అచీవ్మెంట్స్ కాలమ్లో చివరి అప్డేట్ 2015 ఏప్రిల్ 8వ తేదీ జరిగింది. తెలంగాణ రాకముందు, వచ్చాక అని చెప్పుకుంటున్న జెన్కో యాజమాన్యం ఆ అచీవ్మెంట్స్ను కూడా వెబ్సైట్లో పెట్టుకోలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని విద్యుత్రంగ నిపుణులు చెప్తున్నారు. నోటిఫికేషన్స్ కాలమ్లో షోకాజ్ నోటీసుల సబ్కాలమ్ను 2016 జూన్ 1నాటి చివరి సమాచారమే ఉంది. రిక్రూట్మెంట్స్ కాలమ్లో 2018 ఏప్రిల్ 13 నాటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ (హెచ్ఆర్)కు సంబంధించిన సమాచారం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ముందు వరుసలో ఉన్న సంస్థ తన సొంత వెబ్సైట్ను ఎందుకు అప్డేట్ చేసుకోలేక పోతున్నదని విద్యుత్రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వెబ్సైట్ అప్డేట్ చేస్తూ...పారదర్శక సమాచారాన్ని ఉంచితే ఇబ్బందులు వస్తాయనే ఆందోళన జెన్కో అధికారుల్లో ఉన్నదని వారు ఆరోపిస్తున్నారు. నూతన సంవత్సరం 2020 వచ్చి జనవరి నెల మరో 10 రోజుల్లో ముగియనుంది. ఇప్పటికైనా వెబ్సైట్ను అప్డేట్ చేయాలని విద్యుత్రంగ నిపుణులు కోరుతున్నారు.