Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్న కొలువులు కాపాడుకోవాలి..
- కొత్త ఉద్యోగాలకు.. సరికొత్త బాటలేయాలి
- ఈ దిశగా బడ్జెట్ ఉండాలి: విశ్లేషకులు
న్యూఢిల్లీ: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాల కల్పన కంటే కూడా.. ఊడిన ఉద్యోగాలే ఎక్కువ. ముఖ్యంగా 2016 నవంబర్లో అనుహ్యాంగా చేపట్టిన రూ.500, రూ.1000 నోట్ల రద్దు పలు రంగాలను చిన్నాభిన్నం చేసింది. ఫలితంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. వారి కుటుంబాల వారు రోడ్డున పడ్డారు. దీనికి తోడు దేశ ఆర్ధిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యం దెబ్బకు వాహన, రియాల్టీ, ఐటీ తదితర రంగాల్లో భారీగా ఉద్యోగాలు ఊడటంతో వారి కుటుంబాల పరిస్థితి తీవ్ర ఆందోళనకర స్థితికి చేరుకుంది. గత 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా 2017-18లో దేశంలో భారత్లో నిరుద్యోగం 6 శాతానికి ఎగిసిందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణంకాల శాఖకు సంబంధించిన ఎన్ఎస్ఎస్ఓనే వెల్లడించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఉపాధి కల్పన పెంచే విధంగా ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోకి జారుకున్న నేపత్యంలో రానున్న బడ్జెట్లోనైనా సర్కారు ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆర్ధిక విధానాలతో దేశంలో మందగమన పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఉపాధి కల్పనపై తీవ్ర ప్రభావం నెలకొనడంతో ఆయా రంగాల అమ్మకాలు కుదేలవుతున్నాయి. అమ్మకాలు తగ్గడంతో పరిశ్రమ వర్గాలు ఉత్పత్తిని తగ్గించుకోవడం లేదా నిలిపివేయడం వంటి చర్యలకు దిగుతున్నాయి. దీంతో ఉన్న కొలువులు కొండెక్కుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పనితీరుకు ప్రత్యక్షంగా అద్దం పట్టే వాహన, స్థిరాస్తి, ఐటి, విత్త సంస్థల విభాగంలో భారీగా ఉద్యోగ కోతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇక ఆయా కంపెనీలు కొత్త ఉద్యోగాల ప్రకటనలే ఇవ్వడం లేదు. ఈ పరిణామాలను ప్రధానంగా తీసుకోవడం ద్వారా ఉపాధి కల్పన పెంచడానికి దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడులు పెరిగేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని పేర్కొంటున్నారు.రిలయన్స్ జియో రాకతో టెలినార్, ఎయిర్సెల్, టాటా కమ్యూనికేషన్స్, ఆర్కామ్, ఎంటీఎస్ లాంటి సంస్థలు మూత పడ్డాయి. దీంతో ఈ కంపెనీల్లో పని చేసే లక్షలాది మంది రోడ్డున పడ్డారు.
రెండున్నరేండ్లలో రెట్టింపు నిరుద్యోగం
గడిచిన 2019 సెప్టెంబర్ - డిసెంబర్ త్రైమాసికంలో భారత్లో నిరుద్యోగం 7.5 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఇ) ఓ రిపోర్టులో వెల్లడించింది. భారత్లో 60 శాతం అక్షరాస్యత ఉన్నప్పటికీ ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఆందోళనకరమని హెచ్చరించింది. 2017 మే- ఆగస్టు కాలంలో 3.8 శాతంగా ఉన్న నిరుద్యోగం వరుసగా ఏడో సారి ఎగిసి రెట్టింపు స్థాయికి చేరిందని సీఎంఐఇ పేర్కొంది. దీంతో కేవలం రెండున్నరేళ్లలోనే నిరుద్యోగం రెట్టింపు అయినట్లయ్యింది. సీఎంఐఇ దాదాపు 1,74,405 కుటుంబాలను సర్వే చేసి ఈ రిపోర్టును రూపొందించింది. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లోనే నిరుద్యోగం అత్యధికంగా 9 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 6.8 శాతంగా నమోదయ్యింది. మొత్తం నిరుద్యోగుల్లో 66 శాతం వాటా గ్రామీణ ప్రాంతాలదే.
చిన్న పరిశ్రమలకు దన్ను..
ఉపాధికి ఎక్కువ అవకాశాలు కల్పించే చిన్న పరిశ్రమలకు మద్దతు పెరిగేలా బడ్జెట్ రూపకల్పన జరగాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మాజీ ఛైర్మన్ ఎస్ ఎస్ మంత పేర్కొన్నారు. మౌలిక వసతుల సంస్థలు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి ఆస్కారం ఉన్న రంగమని అన్నారు. అదే విధంగా విద్యా, నైపుణ్యాభివృద్ధి సామర్థ్యాలు పెంచేలా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత విద్యా విధానం కూడా ఆ విధంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పట్టణ యువత నైపుణ్య కొరతతో నిరుద్యోగాన్ని ఎక్కువగా ఎదుర్కుంటుందన్నారు.
బడ్జెట్లో ఈ దిశగా చర్యలు అవసరం..
- ఉన్న ఉద్యోగాలు ఊడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
- పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాలి.
- చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతునివ్వాలి.
- స్వయం ఉపాధి కల్పనకు ప్రోత్సాహాకాలు పెంచాలి.
- వృద్ధి రేటు పెంపునకు చర్యలు తీసుకోవాలి.
- నైపుణ్య శిక్షణ ఇచ్చే కోర్సులను ప్రవేశపెట్టాలి.
- వ్యవసాయోత్పత్తుల ప్రాసెసింగ్లో గ్రామీణ యువతను
తీర్చిదిద్దడం.
- ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీల్లో సమూల మార్పులు చేపట్టడం.
- తద్వారా నిరుద్యోగులకు అన్వేషణ అవకాశాలను పెంచాలి.
- ఉపాధి అవకాశాల్లో వివక్షతను తగ్గించాలి.
- ఔత్సాహికవేత్తలకు రుణ లభ్యతను పెంచాలి.