Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి లక్షన్నర కోట్ల రూపాయలు బకాయిలు పడ్డ టెలికం కంపెనీలు
చెల్లించాలని
గతేడాదిలోనే ఆదేశాలు
- గడువు ముగిసినా పట్టించుకోని టెల్కోలు
- ప్రభుత్వ సంస్థలపైనే భారం మోపిన సర్కారు
కొండూరి వీరయ్య
దేశమంతా ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించబోయే బడ్జెట్ కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నది. ఈ సమయంలోనే దేశంలో మరో టెలికం కుంభకోణానికి పావులు కదులుతున్నాయి. టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్ వాడుకోవటానికి కట్టాల్సిన అద్దె రూపంలో కానీ, లైసెన్స్ బకాయిలు రూపంలో కానీ రూ. 1,47,684 కోట్లు బకాయి పడ్డాయని కేంద్ర టెలికం శాఖ గతేడాది అక్టోబర్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ బకాయిలు వసూలు చేయటానికి టెలికం శాఖ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావటంతో అది కోర్టుకు వెళ్లింది. ఈ మేరకు సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. 2020 జనవరి 23 లోగా ఈ కంపెనీలు తమ బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ సెల్యులార్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (సీఒఏఒఐ) మరో దఫా సర్వోన్నత న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వంలోని ధర్మాసనం 2020 జనవరి 16న తిరస్కరించింది.
దీనిపై ఎయిర్టెల్ కంపెనీ స్పందిస్తూ.. ''కోర్టు ఆదేశించిన విధంగా టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును వినియోగదారులకు మరిన్ని రాయితీలు, సేవలు అందించటానికి ఉపయోగించే అవకాశం ఉంద''ని వాదించింది. ఇదే పనిని ఇప్పటివరకు వినియోగదారులపై మోపిన భారాలు, వసూలు చేసిన లాభాలు నుంచి కూడా ఖర్చు చేయవచ్చు. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ బకాయిలను మినహాయిస్తే ఈ మొత్తం వినియోగదారులకు సేవలు విస్తరించటానికి ఖర్చు చేయగలమంటున్నాయి టెలికం కంపెనీలు. దీనిపై క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తే సదరు క్యురేటివ్ పిటిషన్ను సుప్రీం ధర్మాసనం స్వీకరించి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు టెలికం కంపెనీల నుంచి బకాయిలు వసూలు చేయొద్దని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఈ రూ. 1,47,684 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి జమపడే అవకాశం లేదు.
పైపైన చూస్తే ఇది కేవలం ప్రయివేటు టెలికం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న న్యాయపరమైన వివాదంగా కనిపిస్తుంది. కానీ రూపొందుతున్న సంక్షోభం ఈ న్యాయవివాదంలో లేదు. దీనికి వెనుక జరిగిన తతంగంలోనే ఉంది అసలు విషయం. కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా మాటల్లో క్రోనాలజీ (వరుస క్రమాన్ని) అర్థం చేసుకుంటే తప్ప ఈ కుంభకోణం మన కండ్ల ముందే ఎలా ఓ రూపం తీసుకుంటుందో అర్థమవుతుంది.
సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం జనవరి 23వ తేదీ నాటికి ప్రయివేటు టెలికం కంపెనీలు మొత్తం బకాయిలు చెల్లించాలి. ఈ ఆదేశాన్ని సవరించాలని కోరుతూ ఆ కంపెనీలు జనవరి 16న కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థననూ ధర్మాసనం తిరస్కరించింది. అసలు పరిణామం ఆ తర్వాత జరిగింది. జనవరి 20వ తేదీన టెలికం మంత్రిత్వ శాఖ కొన్ని ప్రభుత్వరంగ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం టెలికం శాఖకు సొంతమైన స్పెక్ట్రంను వివిధ ప్రభుత్వరంగ సంస్థలు వాడుకుంటూ ఉన్నందున ఏయే కంపెనీ ఎంతెంత స్పెక్ట్రం వాడుకుంటోందో ఆమేరకు అపరాధ రుసుము లేదా పాతబకాయిలు చెల్లించాలన్నది ఈ నోటీసుల సారాంశం. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. ఇంధనరంగంలో ఉన్న కంపెనీలు ప్రధానంగా ఈ నోటీసులు అందుకున్నాయి. వాటిలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ రూ. 48 వేల కోట్లు, గ్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా రూ.1,72,655 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మరో రూ. 40 వేల కోట్లు చెల్లించాలన్నది టెలికం శాఖ కోరిక. ఈ నోటీసులు జనవరి 20వ తేదీన జారీ అయ్యాయి. మరో దఫా జనవరి 23వ తేదీన టెలికం కంపెనీలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను వాదోపవాదాలకు సుప్రీం ధర్మాసనం స్వీకరించింది.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే స్పెక్ట్రం వినియోగ స్వభావానికి సంబంధించినది. ప్రభుత్వరంగ కంపెనీలు రైల్వేలు, బ్యాంకులుతో సహా ప్రత్యేక స్పెక్ట్రంను వాడుకుంటున్నాయి. అయితే ఈ వినియోగం వాణిజ్యసంబంధమైన వినియోగం కాదు. ఆయా ప్రభుత్వరంగ సంస్థలు అంతర్గ తంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవటానికి దీనిని వినియోగించుకుంటున్నాయి. 2019 అక్టోబరు 23న న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకుని కేంద్ర టెలికం శాఖ టెలికం వాణిజ్యంలో లేని కంపెనీలకూ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం ఈ సంస్థలు సుమారు రూ. 3 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ప్రయివేటు కంపెనీలు పైన చెప్పినట్టు రూ. 1,47,684 కోట్లను చెల్లించాలి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ప్రయివేటు కంపెనీలు కట్టాల్సిన మొత్తంలో రూ. 92 వేల కోట్లు ఏ యేడాదికాయేడాది చెల్లించాల్సిన లెసెన్స్ రుసుము. మిగిలింది అసలు కట్టాల్సిన రుసుము కట్టనందుకు నిర్ణయించిన అపరాధ రుసుము. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ఈ బకాయిలు ఎంత అని నిర్ణయించటానికి ఆయా కంపెనీలు స్పెక్ట్రంని టెలికం సేవల వినియోగానికి వెచ్చించిట్లయితే తద్వారా వచ్చిన ఆదాయంలో వాటా కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తీర్పులో ఈ కోణాన్ని అడ్డం పెట్టుకుని చమురు రంగంలో ఉన్న కంపెనీలకు వేల కోట్ల అపరాధ రుసుము చెల్లించాలని టెలికం శాఖ ఆదేశించటం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
ఈ మొత్తం పరిణామంలో కనిపించే కుంభ'కోణం' ఒక్కటే. ఈ ప్రభుత్వరంగ సంస్థలు కూడా సుప్రీంకోర్టు తీర్పుననుసరించి భారాన్ని మోయాలి. లేదా ప్రభుత్వరంగ సంస్థలకు ఇచ్చిన రాయితీలు, అదనపు వెసులుబాట్లు ప్రయివేటు టెలికం కంపెనీలకు కూడా వర్తింపచేయాలి. తద్వారా దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు చెల్లించాల్సిన ప్రయివేటు కంపెనీలు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ముందు ముందు ఈ కుంభకోణం ఏ రూపం తీసుకుంటుందన్నది ఆసక్తికరమైన విషయంగా మారనుంది.