Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లలో రూ.50వేల కోట్ల జారీ లక్ష్యం
- ఐఒబీ ఈడి శ్రీవాస్తవ వెల్లడి
నవతెలంగాణ- బిజినెస్ బ్యూరో
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రుణాలకు ప్రాధాన్యతనిస్తున్నట్టు ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు (ఐఒబీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ శ్రీవాస్తవా అన్నారు. వచ్చే 18-24 నెలల్లో తమ పోర్టుపోలియోలో ఈ రంగ రుణాలను రూ.50,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సోమవారం హైదరాబాద్లో ఆయన 115 మంది చిన్న పరిశ్రమల వారికి రూ.70 కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఇందులో తొలిసారి ఔత్సాహికవేత్తలు, ఎస్సీ, ఎస్టీ, తదితరులు ఉన్నారు. ఈ సందర్భగా శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎంఎస్ఎంఈ వర్గానికి రూ.31వేల కోట్ల రుణాలు అందించినట్టు తెలిపారు. చిన్న పరిశ్రమలకు సులభంగా రుణాలు ఇవ్వడానికి దేశ వ్యాప్తంగా తమకున్న 3300 శాఖల్లోంచి 200 శాఖలను ప్రత్యేకంగా ఎంపిక చేశామన్నారు. అందులోనూ ఎంఎస్ఎంఈలకు పెద్ద మొత్తంలో రూ.10 కోట్ల నుంచి 40 కోట్ల విలువ చేసే రుణాలు ఇవ్వడానికి మరో 24 శాఖలను ఎంపిక చేశామన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఔత్సాహికవేత్తలు కీలకంగా మారారని అన్నారు. ఐఒబి హైదరాబాద్ జోన్లో ఆరు రీజియన్లు ఉన్నాయన్నారు. ఇందులో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, భోపాల్, రారుపూర్ ప్రాంతాల్లోని విత్త అవసరాలను తమ బ్యాంకు తీర్చుతుందన్నారు. వచ్చే ఏడాది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్పీిఒ) ద్వారా నిధులు సమీకరించాలని యోచిస్తున్నామన్నారు. ఎంత వాటా విక్రయించాలి..?, ఎంత మొత్తం నిధులు సమీకరించాలనే దానిపై ఇప్పుడిప్పుడే కసరత్తు ప్రారంభించామన్నారు. రెండు లేదా మూడో త్రైమాసికంలో ఎఫ్ఓకు రావడం ద్వారా మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ఐఒబీ బోర్డు, ఆర్బీఐ, సెబీ అనుమతులు లభించాల్సి ఉంటుందన్నారు.