Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఎవరికీ అర్థంకాని పన్ను విధానమది
- పెట్టుబడులను పెంచేందుకు చర్యలుండాలి.. : రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణియన్ స్వామి
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణియన్ స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కారు దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణగా చెబుతున్న జీఎస్టీని ఆయన ''21వ శతాబ్దపు అతిపెద్ద పిచ్చి వ్యవహారం'' అని అన్నారు. ప్రగ్నా భారతి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ''ఇండియా- యాన్ ఎకనమిక్ సూపర్ పవర్ - 2030'' సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ సుపర్పవర్గా నిలవాలంటే దేశం 10 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అత్యధికంగా సంస్కరణలు తీసుకువచ్చిన భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహా రావుకు అత్యున్నత భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు తీసుకున్న చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ కాలక్రమంలో సగటున ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేస్తూ వచ్చిందని ఆయన అన్నారు. ఇందులో కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదని తెలిపారు. భారత్ 10 శాతం వృద్ధిని అందుకొనేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు కావాల్సిన వివిధ అంశాలను ఈ సమావేశంలో ఆయన ఏకరువు పెట్టారు. మెరుగైన వృద్ధిన సాధించేందుకు గాను మొదట దేశంలో అవినీతిని నియంత్రించాలని, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి తగిన రివార్డ్స్ను ప్రకటించాలని అన్నారు. పెట్టుబడిదారులను ఆదాయపు పన్ను, జీఎస్టీల పేరుతో భయబ్రాంతులను చేయోద్దని ఆయన సూచించారు. ఇది అతిపెద్ద పిచ్చిపని ఆయన అభివర్ణించారు. జీఎస్టీ ఎవరికీ అర్థం కానీ చాలా క్లిష్టమైన విధానమని ఆయన అన్నారు. జీఎస్టీ చెల్లింపునకు గాను ఏ తరహా వ్యాపారి ఏ ఫారమును ఎక్కడ నింపాలనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదని తెలిపారు. అలాగే జీఎస్టీ ఫారములు నింపిన తరువాత వాటిని మళ్లీ కంప్యూటరీకరించాల్సి ఉందని ఆయన అన్నారు.
తమను కలిసేందుకు వచ్చిన వారి విశేషాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. రాజస్థాన్ నుంచి ఒకతను తన వద్దకు వచ్చి తమకు అసలు కరెంటు సౌకర్యమే లేదని.. అలాంటప్పుడు జీఎస్టీ ఫారమును ఎలా, ఎక్కడ అప్లోడ్ చేయాలి నీ నెత్తిమీదా అని అడిగినట్టుగా ఆయన వివరించారు. తాను సదరు వ్యక్తి బాధను అర్థం చేసుకొని వెళ్లి ప్రధాన మంత్రిని కలవాల్సిందిగా సూచించానని అన్నారు. రానున్న పదేండ్ల కాలం పాటు భారత్ 10 శాతం వృద్ధితో రాణిస్తేనే భారత్ సూపర్పవర్ కాగలదని ఆయన అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే 50 ఏండ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనాలను దాటేయగలదని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం డిమాండ్ కొరతను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.