Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కిళ్ల వారీగా ఏజీఆర్ లెక్కింపు
న్యూఢిల్లీ: సవరిం చిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల చెల్లింపులపై సుప్రీంకోర్టు నుంచి తీవ్ర ఆగ్రహాన్ని చవి చూసిన టెలికం కంపెనీలపై మరో పిడుగు పడనుందని తెలుస్తోంది. ఈ కంపెనీలు చూపిన లెక్కలు సవ్యంగా ఉన్నాయో లేదో తేల్చడానికి ఆయా సర్కిళ్ల వారిగా బకాయి చెల్లింపులను సమీక్షించాలని టెలికం శాఖ (డీవోటీ) యోచిస్తోన్నట్లు సమాచారం. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ లావాదేవీలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలకు చెందిన సర్కిళ్ల వారిగా బకాయిలు, లెక్కలు తేల్చడానికి కొంత సమయం పట్టొచ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నట్టు ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అదే విధంగా ఆయా కంపెనీల బ్యాంక్ గ్యారంటీలపై కూడా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. గతేడాది జూలై నాటికి టెలికం సంస్థల మొత్తం ఎజిఆర్ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో రూ.92,641 కోట్లు లైసెన్స్ ఫీజులకు సంబంధించినవి కాగా, మిగతా రూ.55,054 కోట్లు స్పెక్ట్రం వినియోగ చార్జీలుగా ఉన్నాయి. ఇవి కూడా 2018 జూలై నాటికే ఈ లెక్కలని, ఇప్పటిదాకా లెక్కిస్తే బకాయిలు పెరుగుతాయని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మొత్తం బకాయిలను మార్చి 17 నాటికి చెల్లించాలని టెల్కోలను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
కొసరే రూ.70 వేల కోట్లు
ఏజీఆర్ బకాయిల్లో లైసెన్స్ ఫీజుకు సంబంధించిన బాకీల్లో 74 శాతం వడ్డీ, జరిమానాలు, జరిమానాలపై వడ్డీనే ఉన్నాయని టెలికం శాఖ అధికారులు పేర్కొంటున్నారు. టెలికం శాఖకు టెలికం సంస్థల లైసెన్స్ ఫీజు బాకీలు రూ. 92,641 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ. 22,589 కోట్లు లైసెన్స్ ఫీజు బకాయి కాగా, మిగతాదంతా దీనిపై వడ్డీ, జరిమానాలు, ఆ జరిమానాలపై మళ్లీ వడ్డీనేనని సంబంధిత వర్గాల సమాచారం. కాగా, లైసెన్స్ ఫీజు బకాయిల్లో భారతీ ఎయిర్టెల్ వాటా రూ.5,528.52 కోట్లుగా ఉంటే, వొడాఫోన్ ఐడియావి రూ.6,870.69 కోట్లుగా ఉన్నది. టాటా గ్రూప్ రూ.2,321.31 కోట్లు, ఎయిర్టెల్లో విలీనమైన టెలినార్ రూ.529.02 కోట్ల బకాయిలున్నాయి.
రేపో మాపో మళ్లీ నోటీసులు..
టెలికం సంస్థలకు టెలికం శాఖ మరోసారి నోటీసులను జారీ చేయనున్నది. ఎజిఆర్ బకాయిలు పూర్తిగా చెల్లించనందుకుగాను ఈ వారం వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్లకు టెలికం శాఖ నోటీసులు ఇవ్వనుందని సంబంధిత వర్గాల సమాచారం. ఇప్పటికే భారతీ ఎయిర్టెల్ రూ.10,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.3,500 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ రూ.2,197 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. వొడాఫోన్ ఐడియా బకాయిలు రూ.53,038 కోట్లుగా ఉంటే, భారతీ ఎయిర్టెల్ బకాయిలు రూ.35,586 కోట్లుగా ఉన్న సంగతి విదితమే. దీంతో మిగతా బాకీల వసూళ్లలో భాగంగా టెలికం శాఖ ఒకటి, రెండ్రోజుల్లో మళ్లీ నోటీసులు ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.