Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక ఇబ్బందుల్లోకి ప్రధాన రంగాలు
- మరింతగా పెరుగుతున్న మొండి బాకీలు
- స్లిప్పేజ్ల సగటులో 40 శాతం వృద్ధి..!
- నాలుగో త్రైమాసికంలో కొత్త సవాళ్లు
- ఇలాయితే బ్యాంకింగ్ రంగం కోలుకుంటుందా ?
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ఆర్థిక భవిష్యత్తుపై మళ్లీ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే పెరిగిపోయిన నిరర్థక ఆస్తులతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకులకు రానున్న రోజుల్లో ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కారు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నాలను చురుగ్గా చేపట్టకపోవడం, ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితుల కారణంగా బ్యాంకులకు రానున్న రోజుల్లో మొండి బాకీల తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఆర్థిక మందగమనం కారణంగా స్థిరాస్తి రంగం, సూక్ష్య చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), టెలికాం, వాహన రంగం, వ్యవసాయ రంగాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంకులకు తాజాగా నిరర్థక ఆస్తుల బెడద పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్లలో రాష్ట్రాలలో రుణమాఫీని చేపట్టారు. దీంతో దేశంలోని నాలుగు ప్రధాన బ్యాంకులపై సంయుక్తంగా దాదాపు రూ.60,762 కోట్ల మేర భారం పడింది. తాజా చర్యలతో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో భారతీయ స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ రోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాల స్థూల మొండి బాకీలు గణనీయంగా పెరిగాయి. దేశ ప్రజలకు ప్రధాన జీవనాధారమైన వ్యవసాయాన్ని కాపాడే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడంతో రైతులు తమ రుణాలను తిరిగి చెల్లించలేకపోతున్నారు. దీంతో సర్కారు ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి రుణ మాఫీలను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఈ చర్యలు బ్యాంకులకు గుదిబండలా మారుతున్నాయి. మరోవైపు దేశంలో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్ఎంఈల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నోట్లరద్దు, జీఎస్టీ సంస్కరణల పేరుతో మోడీ సర్కారు ఎంఎస్ఎంఈ నడ్డి విరిచిన సంగతి తెలిసిందే. ఈ సంస్కరణలు అమలులోకి తెచ్చి రెండేండ్లు గడుస్తున్నా సర్కారు నుంచి తగిన చేయూత కరువవడంతో చిన్న పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఫలితంగా ఎంఎస్ఎంఈ విభాగంలో స్థూల మొండిబాకీలు 6 శాతం పెరిగి రూ.66,280 కోట్లకు పెరిగినట్టుగా బ్యాంక్ల గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు వాణిజ్య వాహనాల అమ్మకాలు పడిపోవడం, ఈ రంగంలోని నిరర్థక ఆస్తుల పెరుగుదలకు దారి తీస్తోంది.
టెలికాం రంగం నుంచి పెద్ద ముప్పు..
తాజాగా టెలికాం రంగంలో ఏజీఆర్ బకాయిలు బ్యాంక్లకు గుదిబండలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రంగంలోని కంపెనీలు ఏజీఆర్తో సహ స్పెక్ట్రమ్ బకాయిల పేరుతో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల మేర బకాయిలను చెల్లించాల్సి ఉంది. జియో షాక్ నుంచి నిలదొక్కుకునే ప్రయత్నాల్లో టెలికాం సంస్థలు ఇప్పటికే భారీగా బ్యాంకుల వద్ద అప్పులు చేశాయి. ఇప్పుడు ఏజీఆర్ పేరుతో ఆయా సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోతే టెలికాం సంస్థలు చెల్లించాల్సి బకాయిల రాకపై తీవ్ర ప్రభవం కనిపించే అవకాశం ఉందని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే రానున్న రోజుల్లో బ్యాంక్ల స్థూల మొండి బాకీలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. దేశంలోని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో పీఎస్బీలకు తాజాగా రూ.56000 కోట్ల మేర మొండి బాకీల సెగ తగిలే అవకాశం ఉందని మ్యాక్వరీస్ తెలిపింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది రూ.34,500 కోట్ల దరిదాపుల్లో ఉన్నట్టగా సంస్థ తెలిపింది.
40 శాతం పెరిగిన స్లిప్పేజ్ సగటు..
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే రుణాల తిరిగి చెల్లింపుల్లో వైఫల్యత డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అధికంగా నమోదు అయిది. దేశంలో ప్రధానంగా నిలిచే డజను బ్యాంకులకు రావాల్సిన రుణాల చెల్లింపు సగటు అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో దాదాపు 40 శాతం పెరిగింది. దీనిని బట్టి చూస్తే బ్యాంకులు రానున్న రోజుల్లో మరింత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రయివేటు రంగంలోని బ్యాంకుల స్లిప్పేజ్లు తగ్గాయి. ప్రయివేటు రంగంలోని ఆరు పెద్ద బ్యాంక్లకు స్లిప్పేజ్లు రూ.18,200 కోట్ల నుంచి రూ.17,900 కోట్లక తగ్గిపోయింది.
కలవరపెడుతున్న కార్పొరేట్ అలజడి...
కార్పొరేట్ రంగంలో ఇటీలవ చోటు చేసుకుంటున్న పరిణామాలు సైతం బ్యాంకులను కలవరపెడుతున్నాయి. దీవాన్ హౌసింగ్, కేఫ్ కాఫీడే, కాక్స్ అండ్ కింగ్స్, రిలయన్స్ గ్రూపు, సుజ్లాన్ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందుల్లోకి కూరుకుపోవడం కూడా బ్యాంకులను కలవరపెడుతోంది. ఈ కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో ఆయా కంపెనీల నుంచి రావాల్సిన సొమ్ములు వసూలవుతాయో లేదోనన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. బ్యాంకులు చాలా వరకు కార్పొరేట్ సంస్థల నుంచి రావాల్సిన మొండి బాకీలను రానీ బాకీలుగా రద్దు చేయడంతో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో పీఎస్బీల కార్పొరేట్ రుణాల ఒత్తిడి 19.3 శాతం నుంచి 17.9 శాతానికి దిగి వచ్చింది. అయితే డిసెంబరు తరువాత నుంచి నమోదవుతున్న పరిణామాలను బట్టి చేస్తే నాలుగో త్రైమాసికంలో ఇది మరింతగా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.