Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి నుంచే సిబ్బంది పని
- పలు కంపెనీల నిర్ణయం
- నిర్మానుష్యంగా ఐటీ పార్క్లు
- అదే బాటలో మరిన్ని సంస్థలు
నవతెలంగాణ - వాణిజ్య ప్రతినిధి
కరోనా వైరస్ భయాల నేపథ్యంలో పలు కంపెనీలు ముందస్తు చర్యల్లో భాగంగా ఉద్యోగులను ఆఫీసులకు రావొద్దని సూచిస్తున్నాయి. ఇంటి వద్ద నుంచే పని చేయాలని కోరుతున్నాయి. సిబ్బంది ఆఫీస్కు రాకపోయిన పని జరుగుతుందని భావించిన విభాగాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా బెంగళూరులోని ఐటీ కంపెనీలు తొలత ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. గడిచిన రెండు, మూడు రోజుల నుంచి అనేక కంపెనీలు ఈ బాట పట్టాయి. బెంగళూరులోని ఆర్ఎంజడ్ ఈకోస్పేస్ బిజినెస్ పార్క్లోని అస్సెంచుర్, ఇంటెల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు సిబ్బందిని ఇంటి నుంచే పని చేయాలని సూచించాయి. మరో టెక్ పార్క్ ఎంబస్సీ గల్స్ లింక్స్లోని ఐబీఏం ఇండియా, గోల్డ్మాన్ సాచ్స్ సర్వీసెస్, డెల్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇండియా సంస్థలు కూడా సిబ్బందికి వర్క్్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాయి. ఎప్పుడూ ఎక్కువగా రద్దీగా ఉండే ఇక్కడి కొన్ని ఐటీ పార్క్ల్లోని పెద్ద టెక్నలాజీ కంపెనీలు నిర్మానుష్యంగా మారాయి. ఇలాంటి పరిస్థితి తాను ఎప్పుడూ చూడలేదని అస్సెంచర్లోని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. ఎక్కువగా రద్డీ ఉండి, ఏసీ కలిగిన కార్యాలయాల్లోని సిబ్బందికి ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పించాలని కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రంగ ప్రాంతంలో ఐదు మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అమెరికా, యూరప్ నుంచి వచ్చిన డెల్ ఇండియా, మైండ్ ట్రీ, గూగుల్ ఐఎన్సి నుంచి వచ్చిన వారిలో ఒక్కో కంపెనీలో ఒక్కోరు చొప్పున ఉన్నారు. వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్ట్, ఇన్ఫోసిస్ ఇతర ఐటి కంపెనీలు ఇప్పటికే కార్యాలయంతో సంబంధం లేని సిబ్బందిని ఇంటి దగ్గర నుంచి పని చేయాలని ఆదేశించింది.
వొల్వా కార్ చర్యలు
దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్నందున తన ఉద్యోగులకు భద్రతా చర్యగా ఇంటి నుంచి పనికి అవకాశం కల్పించినట్టు వోల్వో కార్ ఇండియా తెలిపింది. కరోనాతో కలిగే నష్టాలను తగ్గించడానికి మొత్తం ఆరోగ్య, భద్రతా ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ఉద్యోగులందరూ తక్షణమే ఇంటి నుంచి పని చేయాలని కోరింది. వ్యాపార కొనసాగింపును సులభతరం చేయడానికి అవసరమైన ఐటీ మౌలిక సదుపాయాలు కల్పించినట్టు తెలిపింది. షెడ్యూల్ సమావేశాలు మైక్రోసాఫ్ట్ జట్లు, స్కైప్ ద్వారా నిర్వహించబడతాయని తెలిపింది. ఆఫీసు నుంచి పని చేయాలనుకునే వారు సంబంధిత మేనేజర్కు సమాచారం ఇవ్వడం ద్వారా ఆ అవకాశాన్ని కల్పిస్తామన్నారు. తమ ఉద్యోగులు వైరస్కు గురికావడాన్ని పరిమితం చేయడానికి అన్ని దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలను నిలిపివేసినట్లు తెలిపింది. బాధ్యతా యుతమైన సంస్థగా తమ డీలర్లతో వారి సౌకర్యాలు పరిశుభ్రంగా ఉండేలా కూడా కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. ఈ అనిశ్చిత పరిస్థితి ప్రతిరోజూ పెరుగుతోన్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కార్యకలాపాలు కలిగి ఉంది.
ఫోర్డ్లో 10వేల మందికి..
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ భారత్లోని తమ 10,000 మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. తప్పనిసరై కార్యాలయంలో ఉండి పని చేయాల్సిన వారికి మినహాయింపు ఇచ్చింది. ఇటీవలి కాలంలో కరోనా వైరస్ విజృంభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్డ్ ప్రతినిధి తెలిపారు. సోమవారం నుంచే తమ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని కల్పించామన్నారు.
విభిన్నంగా బోనస్..
కొన్ని దేశాల్లో పలు కంపెనీలు కొద్ది రోజులు వేతన రహిత సెలవు తీసుకోవాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తోన్నట్టు రిపోర్టులు వస్తోన్నాయి. కాగా అమెరికాలోని వర్క్డే ఫైనాన్షియల్ కంపెనీ కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి తన ఉద్యోగులకు రెండు వారాల వేతనాన్ని బోనస్గా అందజేయడం విశేషం. కరోనావైరస్ కారణంగా పెరిగిన ధరలు, ఇతర ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ బోనస్ను అందజేస్తోన్నట్టు తెలిపింది. ఈ విపత్తు సమయంలో మా ఉద్యోగులకు అండగా నిలవడం తమ బాధ్యతని ఆ కంపెనీ పేర్కొంది.