Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బజాజ్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత
- టాటా మోటార్స్ కార్యకలాపాలు తగ్గింపు
- ఇప్పటికే ఆందోళనలో వాహన పరిశ్రమ
నవతెలంగాణ - వాణిజ్యప్రతినిధి
ప్రభుత్వ విధానాలతో దేశంలో నెలకొన్న మాంద్యం దెబ్బతో ఇప్పటికే అమ్మకాలు లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న వాహన పరిశ్రమపై కరోనా పిడుగు ఆ రంగాన్ని మరింత కుదేలు చేస్తోంది. ప్రజల కొనుగోళు శక్తి హరిం చుకుపోవడంతో మార్కెట్లో డిమాండ్ లేకపోవడం మరోవైపు వైరస్ భయాల నేపథ్యంలో పలు వాహన కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి. ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్ ఆటో మహారాష్ట్రలోని చక్కన్ ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపి వేయాలని నిర్ణయించింది. టాటా మోటార్స్ పూణె ప్లాంట్లో ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇదే బాటలో మరిన్ని వాహన కంపెనీలు నిర్ణయం తీసుకోనున్నాయని తెలుస్తోంది. అమ్మకాలు లేకపోవడంతో గత కొన్ని నెలలుగా మారుతి సుజుకి లాంటి పెద్ద కంపెనీలు ఉత్పత్తిలో కోత విధించుకుంటూ వస్తోన్నాయి. ఇలాంటి పరిణామాలతో ఈ రంగంలో వేలాది మంది ఉద్యోగాలు ఊడాయి. దీనికి తోడు కరోనా భయాలతో ఆ రంగంపై ఆధారపడిన వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
మహారాష్ట్రలో కరోనా కేసులు అధికంగా నమోదు కావడంతో అక్కడి పరిశ్రమల కార్యకలాపాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బజాజ్ ఆటో తన చక్కన్ ఫ్యాక్టరీని మూసివేయడంతో పాటుగా కార్పొరేట్ ఆఫీసు కార్యకలాపాలను నిలిసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కరోనా భయాలకు వాహన పరిశ్రమలో మూసివేసిన తొలి కంపెనీగా నిలిచింది. పూణె హెడ్ క్వార్టర్గా పని చేస్తోన్న ఈ కంపెనీ గత ఫిబ్రవరిలోనే అంతర్జాతీయ ప్రయాణాలను రద్దు చేసినట్టు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ తెలిపారు. మార్చి ప్రారంభంలోనే తమ సిబ్బందికి ఇంటి వద్ద నుంచి పని చేసే సౌలభ్యం కల్పించామన్నారు. మహారాష్ట్రలో కరోనా విజృంభించడంతో ముంబయి, నాగ్పూర్, పూణె, పింప్రి-చించువాడ్ పారిశ్రామిక తదితర కీలక ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు.
జీతాలు ఇస్తాం : టాటా మోటార్స్
పూణె సమీపంలోని పింప్రి-చించ్వాడ్లోనే టాటా మోటార్స్ తయారీ కేంద్రం ఉంది. ఇక్కడ వాణిజ్య, ప్యాసింజర్ వాహనాలను తయారు చేస్తోంది. కాగా ఈ కేంద్రంలో తాత్కాలికంగా తయారీని తగ్గించుకుంటున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. కరోనా వైరస్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గ్వెంటర్ బషెక్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కార్యాలయాల పరిధిలో ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. కరోనా వైరస్ ప్రభావం ఇంకా తీవ్రతరమైతే మంగళవారం నుంచి ప్లాంట్ కార్యకలాపాలు ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలోనే అతిపెద్ద వాహన తయారీదారుగా ఉన్న టాటాకు దేశవ్యాప్తంగా తయారీ కేంద్రాలు ఉన్నాయని టాటా సన్స్ చైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. పుణెలో ఉన్న తయారీ కేంద్రం ఈ సంస్థకు ఎంతో కీలకమన్నారు. ఎక్కువగా కార్లు, ట్రక్కులకు సంబంధించిన తయారీ కార్యకలాపాలు ఇక్కడే నిర్వహిస్తున్నామన్నారు. మరోవైపు కరోనా వైరస్ దృష్ట్యా ప్లాంట్ మూసివేత లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగులు విధులకు హాజరు కానప్పటికీ.. వారికి మార్చి, ఏప్రిల్ నెల జీతాలు చెల్లిస్తామని తెలిపారు. టాటాకు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా బ్రిటన్లోని తమ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు తెలిపింది. వచ్చే వారం నుంచి ఏప్రిల్ 20 వరకు కార్ల ఉత్పత్తిని రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవలే పేర్కొంది.
వోల్వో కార్స్ ఉత్పత్తి రద్దు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ వోల్వో అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో తన ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా యూరప్, అమెరి కాల్లోని ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసినట్టు తెలిపింది. బెల్జియం ప్లాంట్లో మంగళవారమే ఉత్పత్తిని నిలుపుచేయగా, స్వీడన్లోని మూడు ప్లాంట్లలోనూ, అమెరికాలోని దక్షిణ కెరొలినలోని ప్లాంట్లలో మార్చి 26 నుంచి ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ హకన్ శామ్యూల్సన్ తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడి, సంస్థ కొనసాగడం కోసం తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్టు పేర్కొ న్నారు. బెల్జియం ప్లాంట్ ఏప్రిల్ 5న, ఇతర ప్రాంతాల్లో 14న తిరిగి ప్రారంభం కానున్నాయని అన్నారు. అప్పటివరకు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే సౌలభ్యం కల్పిస్తున్నామన్నారు.