Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-రెపోరేటు 4 శాతానికి తగ్గింపు
- మారటోరియం ఆగస్టు వరకు పొడిగింపు: ఆర్బీఐ
-ఈ ఏడాది ప్రతికూల వృద్ధి
ముంబయి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు నెగిటివ్ (మైనస్)గా నమోదు కానుందని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అయితే ఎంత శాతానికి పడిపోనుందో ఆయన స్పష్టం చేయకపోవడం గమనార్హం. నెగిటివ్ వృద్ధి రేటు నిజమైతే జిడిపి గత 40 ఏండ్లలో ఎప్పుడూ లేని కనిష్ట స్థాయికి దిగజారనుంది. ఇప్పటికే అనేక రేటింగ్ ఎజెన్సీలు భారత వృద్ధి రేటు మైనస్లోకి పడిపోనుందని అంచనా వేయగా.. ఆర్బిఐ ఆలస్యంగా ఈ ప్రకటన చేసినట్టయింది. శుక్రవారం దాస్ మీడియాతో మాట్లాడుతూ ద్వితీయార్థంలో వృద్ధి రేటు పుంజుకోవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోమారు రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు తెలిపారు. దీంతో కీలక వడ్డీ రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్లయ్యిందన్నారు. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి కోత పెట్టామన్నారు. వడ్డీ రేట్ల తగ్గింపునకు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సభ్యుల్లోని ఆరుగురిలో ఐదుగురు అనుకూలంగా ఓటు వేశారన్నారు. ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతిన్నాయన్నారు. మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకు రెపో రేటు తగ్గించామని ఆయన స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి మే 31వరకూ మూడు నెలలపాటు రుణ చెల్లింపుల వాయిదాలపై విధించిన మారటోరియంను తాజాగా ఆగస్ట్ 31వరకూ పొడిగిస్తున్నట్లు శక్తికాంతదాస్ పేర్కొన్నారు. దీంతో రుణ గ్రహీతలకు మరో మూడు నెలల ఉపశమనం కల్పించినట్లయింది.
పెను సవాళ్లు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థికరంగ అభివద్ధికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు దాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా కుంటుపడినట్లు దాస్ తెలిపారు. పలు రంగాలలో ఉత్పాదక కార్యకలాపాలతో పాటు పెట్టుబడులు నిలిచిపోయినట్లు తెలిపారు.
వ్యవసాయంపైనే ఆశలు..
దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందని దాస్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగిందని, వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించనున్నట్టుస్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం అంచనా వేయడం క్లిష్టంగా మారిందన్నారు.ఎగ్జిమ్ బ్యాంక్కు రూ.15వేల కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తున్నామన్నారు.