Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మూడోవంతు మహిళలు స్టోర్కు వెళ్లలేదు
-మరింత వెనుకబడిన గ్రామీణ ప్రాంత స్త్రీలు :డబ్ల్యూజీసీ
న్యూఢిల్లీ : బంగారం అంటే భారతీయ మహిళలకు అమితాసక్తి అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ దేశంలో ఇది వరకు ఎప్పుడూ కూడా పసిడిని కొనుగోలు చేయలేని వారు మూడోవంతు ఉన్నారంటే ఆశ్యర్యం కలుగుతుంది. ఇదే విషయం వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్ల్యూజీసీ) అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ రిపోర్టు ప్రకారం.. భారత్లోని 37 శాతం మంది మహిళలు ఇది వరకు ఎప్పుడూ బంగారం కొనుగోలు ఎరగరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత స్త్రీలు మరీ వెనకబడి ఉన్నారు. అయితే భవిష్యత్తులో అయినా తాము ఈ లోహాన్ని కొనుగోలు చేయాలని వారంతా ఆశపడ్డారు.
డబ్ల్యూజీసీ నిర్వహించిన 'రిటైల్ గోల్డ్ ఇన్సైట్స్' సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మాత్రం డిజైనర్ చీరల తర్వాత తాము సొంతగా పసిడి అభరణాలు కొనుగోలు చేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. పసిడి ధరలు అమాంతం పెరిగినప్పటికీ గత ఏడాది కాలంలో తాము పసిడి కొనుగోలు చేసినట్టు 40 శాతం మంది తెలిపారు. పట్టణ మహిళలు బంగారం కొనుగోలును సెక్యూరిటీగా భావిస్తున్నారు. దేశంలో ఇప్పటికే 37 శాతం మంది స్త్రీలు పసిడి కొనుగోళ్లకు దూరంగా ఉండగా....ఇందులోనూ గ్రామీణ ప్రాంత మహిళలు 44 శాతం మంది ఎప్పుడూ బంగారాన్ని కొనలేదు.
పట్టణ ప్రాంతాల్లో ఇది 30 శాతంగా ఉంది. యువతులు మాత్రం పసిడి వినియోగంలో చాలా ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఈ రంగంలో తమకు విస్తృతావకాశాలు ఉన్నాయని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పిఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత అభరణాల మార్కెట్కు విస్తృతాధరణ, గుర్తింపు ఉన్నాయన్నారు. ఇప్పటికీ మూడో వంతు మంది మహిళలు పసిడి కొనుగోలు చేయకపోవడానికి గల కారణాలను ఈ సర్వేలో గుర్తించకపోవడం గమనార్హం. వారి యొక్క ఆర్ధిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.