Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ నూతన విద్యావిధానం-2020 విద్యలో అంతరాలు పెంచేలా ఉందని యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి పేర్కొన్నారు. అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఎస్టిఎఫ్ఐ) 20వ ఆవిర్భావ దినోత్సవం యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో బుధ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో ఎస్టిఎఫ్ఐ కీలకపాత్ర పోషించిందన్నారు. విద్య, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో సమాఖ్య ముందుందని చెప్పారు. పార్లమెంటులో చర్చించకుండానే నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావడాన్ని ఖండిస్తున్నామని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. విద్యారంగాన్ని కేంద్రీకృతం చేస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాయడంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా కార్పొరేటీకరణకు ఈ విధానం దారితీస్తుందన్నారు. రాజ్యాంగ లక్ష్యాలు, స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. 6-14 ఏళ్ల విద్యను 3-18 ఏళ్లకు మార్చినప్పటికీ విద్యాహక్కు చట్టంలో మార్పులు చేయాలనే సూచన కూడా లేదని, సీనియార్టీ బదులు మెరిట్ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలనడం అక్రమాలకు దారితీస్తుందని, రిజర్వేషన్లకు అవకాశం కోల్పోతారని తెలిపారు. డాక్యుమెంట్లో గొప్ప లక్ష్యాలు చెప్పడం తప్ప అమలుకు ఎటువంటి ప్రణాళికలు, కార్యాచరణ ప్రతిపాదించకపోవడం దారుణమన్నారు. విద్యకు జిడిపిలో ఆరు శాతం ఖర్చు చేస్తామని చెప్పడం తప్ప అమలు కాలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఖర్చు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.కృష్ణసుందరరావు, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్పి మనోహర్కుమార్, సహాధ్యక్షులు కె.భగీరథి తదితరులు పాల్గొన్నారు.