Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి నట ప్రస్థానం మంగళవారంతో 42 వసంతాలను పూర్తి చేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అప్రహాతితంగా చిరంజీవి అలరిస్తూనే ఉన్నారు. తనదైన గ్రేస్ మార్క్ యాక్టింగ్తో, డాన్సింగ్ స్టయిల్తో అందరినీ ఫిదా చేశారు. ఇక ఆయన అభిమానుల గురించి వేరే చెప్పక్కర్లేదు. 1978, సెప్టెంబర్ 22న చిరంజీవి నటించిన 'ప్రాణం ఖరీదు' విడుదలై విశేష ప్రేక్షకాదరణతో మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి వెను తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. ఎన్నో సంచలన విజయాలు సాధించిన చిత్రాల్లో నటించారు. అలాగే కొన్ని సినిమాలు డిజాస్టర్లూ అయ్యాయి. అయినప్పటికీ పడి లేచిన కెరటానికి ప్రతీకగా నిలిచి మెగాస్టార్ అనిపించుకున్నారు. నటుడిగా నిలదొక్కుకోవడానికి చిరంజీవి ఎంతగా కష్టపడ్డారో, మెగాస్టార్ అనే స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడ్డారు. పేరు రావడం చాలా ఈజీ. కానీ దాన్ని నిరంతరం నిలబెట్టుకోవడంలోనే అసలైన కష్టం ఉందని వేరే చెప్పక్కర్లేదు. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమ, ఆదరణతో 42 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చిరంజీవి స్పందించారు. 'నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో, సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆగస్ట్ 22.. నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే, సెప్టెంబర్ 22.. నటుడిగా 'ప్రాణం' (ఖరీదు)' పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అని మెగాస్టార్ ట్వీట్లో పేర్కొన్నారు.
అలాగే ఈ స్పెషల్ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిరు అభిమానులు 'బాస్ ఇన్ టాలీవుడ్' పేరుతో రిలీజ్ చేసిన కామన్ డిస్ప్లే పిక్ (సీడీపీ)కి బాగా వైరల్ అయ్యింది. నటుడిగా 42 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.