Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాన గంధర్వుడు ఎస్.పి. బాల సుబ్రమణ్యం ఇకలేరనే వార్తను ఇప్పటికీ సంగీత ప్రపంచం జీర్ణించు కోలేకపోతోంది. ఆయన కుటుంబ సభ్యులు. సన్నిహితులు, శ్రేయోభి లాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు.. ఇలా ఆయన పాటతో అనుబంధాన్ని పెనవేసుకున్న ప్రతి ఒక్కరూ బాలు మరణ వార్త నుంచి తేరు కోలేకపోతున్నారు. కరోనా పాజటివ్ కారణంగా ఆగస్ట్ 5న బాలు చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కరోనాతో పోరాడి విజయం సాధించినప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు బాలుని శాశ్వతంగా మనకు దూరం చేశాయి. అయితే ఆయన చికిత్సకి దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు అయ్యిందని, దీన్ని తమిళనాడు ప్రభుత్వం చెల్లించక పోవడంతో సగ భాగం బాలు కుటుంబ సభ్యులు చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ ఎంజీఎం ఆస్పత్రికి చెల్లించారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై దీపా వెంకట్ స్పందించారు. 'దివంగత శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి వైద్య బిల్లుల చెల్లింపులు నేను చేసినట్లుగా వస్తున్న కొన్ని వాట్సప్ సందేశాలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతుండడం బాధాకరం. ఇది పూర్తిగా అవాస్తవం. రెండు వారాల క్రితం ఇంకేమీ చెల్లించనవసరం లేదని ఆసుపత్రి యజమాన్యం బాలు గారి కుటుంబానికి తెలియజేశారు. ఆస్పత్రి ఉత్తమ చికిత్సను అందించడమే గాక, వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నాకు, అదే విధంగా కొన్ని సార్లు మా తండ్రి గారికి సమాచారం ఇస్తున్నారు. బాలు గారు మా కుటుంబానికి దగ్గర వారైనందున మాకు ఈ విషయాలు తెలియజేశారు' అని దీపా వెంకట్ తెలిపారు.