Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలీ నిర్మాతగా అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాంపై తెరకెక్కుతున్న చిత్రం 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి'. అలీ, విజయ కృష్ణానరేశ్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి నటిస్తుండటం విశేషం. ఇప్పటివరకు తెరవెనకనే ఉంటూ ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాల్ని తెలుగు చిత్రసీమకు అందించిన ఈ దిగ్గజ ద్వయం తొలిసారిగా వెండితెర మీద మెరవబోతున్నారు. గతంలో ఎస్వీ కష్ణారెడ్డి పలు చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ, అచ్చిరెడ్డిగారితో కలిసి నటించడం ఇదే మొదటిసారి. అలీని హీరోగా పరిచయం చేసి, ఆయన కెరీర్ని ఓ కీలక మలుపు తిప్పిన అచ్చిరెడ్డి - కష్ణారెడ్డి ఇప్పుడు అలీ కోరిక మేరకు సినిమాలో నటించడానికి అంగీకరించారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ,'నన్ను హీరోగా పరిచయం చేసి నా కెరీర్ని కీలక మలుపు తిప్పిన దిగ్గజ ద్వయం అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి. నేను నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాళ్ళిద్దరూ నటించే అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వారిద్దరి పాత్ర చిన్నదైనప్పటికీ నా మీద అభిమానంతో నటించడానికి అంగీకరించారు. తాజాగా జరిగిన షెడ్యూల్లో అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి మీద కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్ర దర్శకుడు శ్రీపురం కిరణ్ చిత్రీకరించారు. మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా 'వికృతి'కి రీమేక్ సినిమాగా ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో మౌర్యానీ కీలక పాత్ర పోషిస్తున్నారు' అని చెప్పారు. అలీ, విజయకృష్ణ నరేశ్, మౌర్యానీ, పవిత్ర లోకేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు - అలీబాబ, కొనతాల మోహనకుమార్, డిఓపి - ఎస్. మురళి మోహన్ రెడ్డి, సంగీతం - రాకేశ్ పళిడమ్, పాటలు - భాస్కరభట్ల రవికుమార్, ఎడిటర్ - సెల్వకుమార్, ప్రొడక్షన్ డిజైనర్ - ఇర్ఫాన్, ఆర్ట్ డైరెక్టర్ - కేవి రమణ, రచన, దర్శకత్వం - శ్రీపురం కిరణ్.