Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈతరం ఫిలింస్ బ్యానర్లో పలు సామాజిక చిత్రాలను నిర్మించిన నిర్మాత పోకూరి బాబూరావు మనవడు, దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు తమ్ముడి కొడుకు మోనీష్ పత్తిపాటి నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఎంపీఆర్ట్స్ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా 'కథ కంచికి.. మనం ఇంటికి' అనే సినిమాని నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా గురించి నిర్మాత మోనీష్ పత్తిపాటి మాట్లాడుతూ, 'నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. మా తాతగారు పోకూరి బాబూరావు, మా పెదనాన్న భీమనేని శ్రీనివాస రావు తీసే సినిమాలు చూస్తూ పెరిగాను. అప్పుడే నేను సినిమా తీయాలనే కల మొదలైంది. కానీ సినిమా చేయాలంటే ఒక పొజిషన్కి రావాలని స్టడీస్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాను. తర్వాత సినిమా తీయాలనే సంకల్పంతో కొన్ని కథలు విన్నాను.
ఈ క్రమంలో కొరియోగ్రాఫర్ చాణక్య చెప్పిన కథ నచ్చడంతో బ్యానర్ స్థాపించి ఈ సినిమా నిర్మించాను. అయితే ఈ సినిమా చేసినట్టు మా తాతయ్య, పెదనాన్నకు తెలియదు. పూర్తి అయిన తర్వాత సినిమా చేశానని వాళ్ళకి చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సినిమా మొత్తం హర్రర్ కామెడీతో నడుస్తుంది. ఈ టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో, హీరోయిన్లు అదిత్ అరుణ్, పూజిత పొన్నాడతోపాటు హేమంత్, గెటప్ శ్రీను ఇద్దరూ మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇదొక భిన్న హర్రర్ సినిమా. ఇందులో 40 నిమిషాల పాటు వచ్చే గ్రాఫిక్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ మా బ్యానర్లోనే ప్రొడక్షన్ నెంబర్2గా కుమార్ కోట దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాం. ఉగాదికి పూర్తి వివరాలు తెలియజేస్తాను' అని అన్నారు.