Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్స్టోరీ'. ఈ చిత్రంలోని 'సారంగ దరియా' పాట యూట్యూబ్ వ్యూస్లో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సారంగ దరియా.. పాట సాధించిన సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. ''సారంగ దరియా..'పాట విజయం ఊహించిందే. అయితే ఇంత భారీ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. రెండు, మూడేళ్ల క్రితమే ఈ పాట విన్నాను. అవకాశం వచ్చినప్పుడు ఈ పాటను సినిమాలో పెట్టాలనుకున్నా. సందర్భం, సీన్ కుదరడం వల్ల ఈ చిత్రంలో ఈ పాటను పెట్టాను. లిరికల్ వీడియోనే 100 మిలియన్ వ్యూస్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. మా టీమ్ అంతా ఉద్వేగంగా ఉన్నాం. సినిమా ఎప్పుడు చూద్దామా, పాట ఎలా ఉంటుంది అనేది చూసేందుకు ఎదురు చూస్తున్నారు. నా టీమ్ అందరికీ థాంక్స్. మెయిన్ క్రెడిట్ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి ఇవ్వాలి. జానపద గీతాన్ని తీసుకుని, తనదైన ముద్రతో అద్భుతంగా ఈ పాట రాశారు. ఇంత విజయానికి కారణం అయ్యారు. 'చురియా చురియా చురియా ఇది చిక్కీ చిక్కని చిడియా' లాంటి ఎన్నో కొత్త పద ప్రయోగాలు చేశారు. ఇది యూట్యూబ్ లో ఇప్పటికే ఉన్నా, ఇంతగా శ్రోతలకు నచ్చిందంటే ఆయన సాహిత్యం వల్లే సాధ్యమైంది. సంగీత దర్శకుడు పవన్ తనకు ఇది తొలి సినిమా అయినా, ఫోక్ను అర్థం చేసుకుని, ట్యూన్ని డెవలప్ చేసి పాట చేశారు. ఆయనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అన్ని పాటలు మ్యూజికల్ హిట్స్ చేసిన పవన్కు థ్యాంక్స్. గాయని మంగ్లీ తనదైన శైలిలో పాడి, పాటకు ఆకర్షణ తీసుకొచ్చింది. సాయి పల్లవి డాన్స్ ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే. శేఖర్ మాస్టర్ అద్భుతంగా స్టెప్స్ చేయించారు. ఈ లిరికల్ వీడియోకు వచ్చిన దానికంటే పది రెట్లు సినిమాలో వీడియో సాంగ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ''ఫిదా'' సినిమాలో 'వచ్చిండె...' పాట సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయింది. కానీ 'సారంగ దరియా' పాటకు లిరికల్ వీడియోకే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట విజయం సినిమా మీద మరింత అంచనాలు పెంచింది. పాటలన్నీ హిట్టై, ఈ సినిమా మ్యూజికల్ 'లవ్ స్టోరి అని నేను చెప్పిన మాటను నిజం చేశాయి. ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరి అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందని ఆశిస్తున్నా' అని చెప్పారు.