Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.నాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రైతన్న'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ,'మా సిననిమా ఫస్ట్ కాపీ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు జరుగు తున్నాయి. నేటి రైతు పరిస్థితి గురించి ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇవాళ భారతదేశంలో రైతు కుటుంబంతో పెళ్లి సంబంధం అంటేనే ఎవరు ముందుకు రావడం లేదు. మన దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా ఉందా అంటే అది రైతు కుటుంబమే. రైతు పరిస్థితి ఏమిటి?, రైతే దేశానికి వెన్నుముక. రైతే రాజు...ఆ నానుడి ఏమైంది?, ఆ రైతు ఎక్కడున్నాడు?, అన్నం పెట్టే అన్నదాత ఈ రోజు ఏ పొజిషన్లో ఉన్నాడు?, చాలా బాధాకరంగా రైతు పరిస్థితి ఉంది. రైతు తను పండించే పంటకి మార్కెట్లో గిట్టు బాటు ధర రాక, తన అప్పులు తీర్చుకోలేక, బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక, పిల్లల్ని చదివించలేక, వార్ధక్యంలో ఉన్న తల్లితండ్రులకు వైద్యం చేయించలేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు. గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికొస్తున్నాడు. అలా రాకూడదు. రైతు ఆత్మహత్య చేసుకోకూడదు. అన్నం పెట్టే అన్నదాత, ఆ విష్ణు స్వరూపుడు బతకాలి. అలా ఉండాలి అంటే రైతుకి గిట్టుబాటు ధర కావాలి. డాక్టర్ స్వామి నాథన్ కమిటీ సిఫార్స్లను ఇంప్లిమెంట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్దత కలిపించిన నాడు రైతే రాజు. రైతే దేశానికి వెన్నుముక. అప్పుడు రైతు వద్ధిలోకి వస్తాడు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగనే రోజు వస్తుంది. అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను తీసిన చిత్రమే ఈ 'రైతన్న'. సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను' అని తెలిపారు.