Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలో చర్యల్లో భాగంగా అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొంతమందికి కరోనా నిర్ధారణ కావడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన హోం క్యారంటైన్లోకి వెళ్ళినట్టు జనసేన పార్టీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
'జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ముఖ్యమైన కార్య నిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సలహాతో పవన్కళ్యాణ్ హోం క్యారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. గత వారం రోజులుగా ఆయన సిబ్బందిలో ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం ఐసోలేషన్కి వెళ్ళారు. అయితే రోజువారి విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల ఆయన నటించిన 'వకీల్ సాబ్' విడుదలై ఆశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ నుంచి తనని కలవడానికి వచ్చేవారిని సైతం పవన్కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేలా ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు.