Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లీడర్', 'కష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి'.. ఇలా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలతో రానా ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరో భిన్న కథతో విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో రూపొందబోయే సినిమాకి రానా గ్రీన్సిగల్ ఇచ్చారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుంది. నందమూరి బాలకష్ణ హీరోగా 'టాప్ హీరో', 'దేవుడు', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ', రాజేంద్రప్రసాద్ హీరోగా 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. అలాగే నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ సినిమా 'ఇమైక్క నొడిగల్'ను తెలుగులో 'అంజలి సిబిఐ'గా విడుదల చేశారు. కొంత విరామం తర్వాత రానా హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు మాట్లాడుతూ, 'ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా సినిమా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. ఇప్పటికే కథ ఓకే అయ్యింది. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ చాలా కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం' అని చెప్పారు.