Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన అత్యద్భుత గానంతో ఆబాలగోపాలాన్ని మైమరపించిన గాన గంధర్వుడు ఎస్.బి.బాలసుమ్రణ్యంకు తెలుగు చిత్ర సీమ ఘనమైన నివాళిని అర్పించేందుకు రంగం సిద్ధం చేసింది. బాలు 75వ జయంతి (డైమండ్ జూబ్లీ) సందర్భంగా తెలుగు చిత్ర సీమ జూన్ 4న స్వర నీరాజనం అందించబోతోంది.
బాలు గానంలో కోటి రాగాలు, శతకోటి స్వరాలు, అనంతకోటి తాళాలు.. ఆ పల్లవులు మన మదిని తాకుతాయి.. ఆ చరణాలు మన మనసుల్ని దోచేస్తాయి. ఆయన మన బాలుడు అనడం కన్నా ఆబాలగోపాలానికి ఆరాధనీయుడు అనడంలోనే ఆనందం ఉంటుంది. అందుకే బాలు పట్ల తనకున్న ఆరాధనను చిత్రసీమ వ్యక్తం చేస్తూ, గ్రాండ్ ట్రిబ్యూట్ నిర్వహించబోతోంది.
తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకి బాలు చేసిన సేవల్ని గుర్తు చేస్తూ ఆయనకు ఘననివాళి అర్పించబోతోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్ను తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. ఇందులో అతిరథమహారథులైన తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలందరూ పాల్గొంటూ, ఆ రోజును బాలుకు అంకితం చేయబోతున్నారు. తెలుగు సినిమా రంగం ఒక్క తాటిపైకి వచ్చి అంతర్జాలం వేదికగా చేపడుతున్న బహత్తర కార్యక్రమమిది. ఆ గుండె గొంతుక ఎప్పటికీ మూగవోదని, ఆయన పాటలోని మాధుర్యం ఎన్నటికీ తరగబోదని చాటబోతున్నారు.
ఈ కార్యక్రమం గురించి డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ, 'బాలూ గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆరోజుని బాలుగారికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి గౌరవార్థం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకి బాలుగారు చేసిన సేవల్ని గుర్తుచేస్తూ సినీ ప్రముఖులంతా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇది దాదాపు 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్గా కొనసాగుతుంది. దీనికి పరిశ్రమ అంతా సహకరిస్తోంది. సంగీతాభిమానులు, బాలుగారి అభిమానులు ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'జూన్ 4 న బాలు గారికి పెద్ద ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఇందులో ఇండిస్టీ అంతా పాల్గొంటుంది. 'మా' అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు.. ఇలా అందరూ పాల్గొంటారు. నాన్ స్టాప్గా జరిగే ఈ ప్రోగ్రామ్ని చూసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం' సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు.