Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'పుష్పక విమానం'. నూతన దర్శకుడు దామోదర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గీత్ సైని కథానాయికగా నటిస్తోంది. హీరో విజరు దేవరకొండ సమర్పిస్తున్నారు. కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ పతాకాలపై గోవర్ధన్రావు దేవరకొండ, విజరు మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని 'కళ్యాణం..' అంటూ సాగే లిరికల్ సాంగ్ను అగ్ర కథానాయిక సమంత శుక్రవారం రిలీజ్ చేశారు. 'ఈ పాట నాకెంతో బాగా నచ్చింది. హీరో ఆనంద్ దేవరకొండ, నిర్మాత విజరు దేవరకొండతో పాటు 'పుష్పక విమానం' టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని సమంత చెప్పారు.
'సినిమాలో ఈ పాట హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంలో వస్తుంది. సుందర్, మీనాక్షి పెళ్లి వేడుకను చూసేందుకు అతిథులంతా ఆనందంగా ఎదురు చూస్తుంటారు. వాళ్ల పెళ్లి కార్యక్రమాలు మంగళ స్నానాలతో మొదలవుతాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అందంగా ముస్తాబై మండపంలోకి వస్తారు. ఇద్దరి ముఖాల్లో తెలియని బిడియం, సిగ్గు ఉట్టిపడుతుండగా..అమ్మలాలో పైడి కొమ్మలాలో... ముద్దుల గుమ్మలాలో సందళ్లు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో.. మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో...అంటూ ఈ 'కళ్యాణం..' పాట ప్రారంభమవుతుంది. చరణంలో పెళ్లిని అంకెలతో పోల్చూతూ గీత రచయిత కాసర్ల శ్యామ్ అద్భుతంగా రాశారు. ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మలా బంధంగా...ఎనిమిది గడపదాటి ఆనందాలు చూడగా..మీ అనుబంధమే బలపడగా..ఇక తొమ్మిది నిండితే నెల..నెమ్మ నెమ్మదిగా తీర్ఱె కల..పది అంకెల్లో సంసారమిలా, పదిలంగా సాగేటి అల.. అని సాగే చరణంలో ఆదర్శ వైవాహిక జీవితాన్ని చూపించారు. మంగ్లీ, సిధ్ శ్రీరామ్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినేలా పాడారు. తన మ్యూజిక్ టాలెంట్తో 'కళ్యాణం...' పాటను సంగీత దర్శకుడు రామ్ మిరియాల మరో హిట్ నెంబర్ చేశారు. సందర్భానుసారంగా సింపుల్గా, బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చేశారు రఘు మాస్టర్. అలాగే నీల్ సెబాస్టియన్ వేసిన పెళ్లి మండపం సెట్ ఎంతో అందంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని ఇలాంటి అందమైన పాటలతో పాటు ఆసక్తికర సన్నివేశాలను వెండితెరపై చూపించబోతున్నారు' అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, రచన-దర్శకత్వం: దామోదర.