Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు?, వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు?, జీవితాంతం కలిసుండాలని ఎలా నిర్ణయించుకున్నారు? అనే కథాంశంతో రూపొందుతున్న వినోదాత్మక కుటుంబ కథా చిత్రం 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'. పాతికేళ్ల కుర్రాడిగా పార్వతీశం, అతని భార్య పాత్రలో అరవైయేళ్ల మహిళగా హాస్యనటి శ్రీలక్ష్మి వెండితెరపై సందడి చేయనున్నారు. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ, 'సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రమిది. పార్వతీశం, శ్రీలక్ష్మిగారి జంట నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాతో ముగ్గురు కొత్త కథానాయికలను పరిచయం చేస్తున్నాం. త్వరలో వాళ్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. హైదరాబాద్, అరకు, ఈస్ట్ గోదావరి, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 45 రోజులు చిత్రీకరణ చేశాం. విశాఖలో గుమ్మడికాయ కొట్టేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసి, ఆగస్టు మూడో వారంలో సినిమాని విడుదల చేస్తాం. అన్ని వర్గాలను, అన్ని వయసుల వాళ్లను అలరించే చిత్రమిది' అని చెప్పారు.