Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం 'రైతన్న'. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని, త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రైతు నాయకులు ఈ చిత్రాన్ని శనివారం ప్రసాద్ ల్యాబ్లో ప్రత్యేకంగా వీక్షించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ,'ఈ సినిమాలో ఎస్పీ బాలు, వంగపండు ప్రసాదరావు పాటలు పాడారు. వారికి నా నివాళులు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా తీశాను. నేటి రైతు పరిస్థితి గురించి ఈ సినిమాలో చూపించబోతున్నాను. భారత దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా ఉంది అంటే అది రైతు కుటుంబమే. రైతు పరిస్థితి ఏమిటి?. రైతే దేశానికి వెన్నుముక. రైతే రాజు...ఆ నానుడి ఏమైంది?, ఆ రైతు ఎక్కడున్నాడు?, అన్నం పెట్టే అన్నదాత ఏ పొజిషన్లో ఉన్నాడు?, పండించే పంటకి మార్కెట్లో గిట్టు బాటు ధర రాక, అప్పులు తీర్చుకోలేక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కొస్తున్నాడు. అన్నం పెట్టే రైతుకి గిట్టుబాటు ధర కావాలి. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్స్లను ఇంప్లిమెంట్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్ధత కల్పించినప్పుడే రైతే రాజు. వ్యవసాయం దండుగ కాదు పండుగనే రోజు రావాలి. అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను తీసిన చిత్రమే ఈ రైతన్న' అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరారావు, కాంగ్రెస్ పార్టీ లీడర్ కోదండ రెడ్డి, సి.పి.ఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, సి.పి.ఎం. నాయకులు మధు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్, ఎం.ఎల్.సి గోరటి వెంకన్న, కవి అందె శ్రీ, రైతు నాయకులు వెంకటరామయ్య, మల్లారెడ్డి, గోవర్ధన్, రైతు సంఘం సాగర్, శ్రీమతి పద్మ తదితరులు పాల్గొని నేటి రైతు పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు ఆర్. నారాయణమూర్తి ఆవిష్కరించారని కొనియాడారు.