Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాష్రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత, సి.వి.ఎల్.నరసింహారావు తదితరులు పోటీ పడుతున్న విషయం విదితమే. రోజుకొక వివాదంతో ఇప్పటికే 'మా' ఎన్నికలపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అగ్ర కథానాయకుడు బాలకృష్ణ 'మా' ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ, ''మా' ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోను. 'మా' శాశ్వత భవనం కోసం గతంలో 'మా' ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లు వేసుకుని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు?, 'మా'కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారు. తెలంగాణ సర్కారు నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. 'మా' శాశ్వత భవనం నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించగా, తానూ అందులో భాగస్వామినవుతా అని బాలయ్య చెప్పారు. అందరూ కలిస్తే 'మా' కోసం మయసభ లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని, మనది గ్లామర్ పరిశ్రమ.. మన సమస్యల్ని బహిరంగంగా చర్చించకూడదని బాలకృష్ణ 'మా' సభ్యులకు సూచించారు.