Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్వతీశం, హాస్యనటి శ్రీలక్ష్మి జంటగా నటిస్తున్న చిత్రం 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై చైతన్య కొండ దర్శకత్వంలో గోగుల నరేంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాట 'అచ్చమైన తెలుగింటి పిల్లవే'ను దర్శకులు మారుతి శుక్రవారం విడుదల చేశారు. సత్య కశ్యప్ సంగీతంలో ప్రణవం రాసిన ఈ పాటను సాయి చరణ్ ఆలపించారు. సినిమా విజయవంతం కావాలని మారుతి ఆకాంక్షించారు. ఈ సినిమా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చైతన్య కొండ మాట్లాడుతూ, 'స్వచ్ఛమైన కుటుంబకథా చిత్రమిది. ఇరవైయేళ్ల యువకుడు, అరవైయేళ్ల మహిళ ఎలా భార్యాభర్తలు అయ్యారనేది సినిమా కథ. ఇటీవల గోపీచంద్ మలినేని విడుదల చేసిన టీజర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్గా దర్శకుడు మారుతి రిలీజ్ చేసిన 'అచ్చమైన తెలుగింటి...' పాటకి కూడా మంచి స్పందన లభిస్తోంది. సత్య కశ్యప్ చక్కటి బాణీలు ఇచ్చారు' అని అన్నారు. 'మా చిత్రంలోని తొలిపాటను మారుతి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ నెలాఖరున విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత గోగుల నరేంద్ర తెలిపారు.