Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం 'లవ్స్టోరి'. శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఏషియన్ సినిమాస్ సంస్థ కార్యాలయంలో చిత్ర బృందం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, 'ఎన్నో కష్టాలు పడి 'లవ్ స్టోరి' సినిమాని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ ప్రేక్షకులు మా సినిమాకు గొప్ప విజయాన్ని అందించారు. ఈ సినిమా తమకు బాగా నచ్చిందని చెబుతున్నారు. ఈ విజయం గురించి వింటుంటే మాటలు రావడం లేదు. కులం పేరుతో ఇబ్బందులు పడే హీరోకు, చిన్నప్పటి నుంచి వివక్షకు, బాధలకు గురైన అమ్మాయికి మధ్య తెరకెక్కించిన ఈ కథను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత సొసైటీకి మంచిని చెప్పే ఒక సినిమా చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత స్కూల్స్, కాలేజీలకు వెళ్లి 'ధీర నువ్వే ధీర' అనే అవేర్ నెస్ ప్రోగ్రాం చేశాం. ఈ కార్యక్రమంలో ఇంట్లో, బయటా ఇబ్బందులకు గురయ్యే అమ్మాయిలను నిర్భయంగా మాట్లాడమని చెప్పాం. దీన్నే ఈ సినిమా కథకు స్ఫూర్తిగా తీసుకున్నా. ఈ కథను తెరకెక్కించడం కత్తి మీద సాము. అలాంటిది ఈ కథను బాగా చూపించామని చెబుతుండటం సంతోషంగా ఉంది. తాము పడుతున్న ఇబ్బందులను ఒక ఆడపిల్ల బయటకు చెప్పుకోగలిగే ధైర్యం ఈ సినిమా చూసి తెచ్చుకుంటే, వివక్షకు గురైన ఒక ఊరి అబ్బాయి ఇది నా కథ అని రిలేట్ చేసుకుంటే, మేము ఇంకా ఎక్కువ సక్సెస్ అయినట్లు భావిస్తాను. నా సినిమాల మీద ఉన్న నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్కు థ్యాంక్స్. నాగ చైతన్య, సాయి పల్లవి తమ క్యారెక్టర్స్లో లీనమై సహజంగా నటించారు' అని చెప్పారు.
'ఇది వినోదం కోసం చూసే సినిమా మాత్రమే కాదు. మన చుట్టూ సమాజంలో, మన ఇంట్లో జరిగే అవకాశమున్న సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లకు ఇంట్లో, బయటా ఇబ్బందిగా ఉంటే, మీరు తప్పకుండా అడగాలి. అలాంటి మార్పు ఈ సినిమా చూశాక వస్తే, మేము సంతోషిస్తాం' అని కథానాయిక సాయిపల్లవి చెప్పారు.
నిర్మాత పి.రామ్మోహన్రావు మాట్లాడుతూ, 'సినిమా బాగుందంటూ ప్రతి థియేటర్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్లో భారీగా రిలీజైన సినిమా మాదే. ఇంత గ్రాండ్ రిలీజ్కు సపోర్ట్ చేసిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్కు థ్యాంక్స్' అని తెలిపారు.
ఇప్పుడున్న టైమ్లో థియేటర్లకు ఆడియెన్స్ ఎంతవరకు వస్తారు అని రిలీజ్ ముందు భయపడ్డాం. కానీ ఇవాళ థియేటర్స్లో ప్రేక్షకులను చూస్తుంటే సంతోషంగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో దర్శకుడు శేఖర్ కమ్ముల అడ్రస్ చేసిన ఇష్యూస్కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్లలో చూడాల్సిన సినిమా.
- హీరో నాగచైతన్య