Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'కొండపొలం'. రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ను చిత్ర బృందం కర్నూలులో వైభవంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ, 'నాకు కర్నూలు జిల్లా అంటే చాలా ఇష్టం. మంత్రాలయం, శ్రీశైలం, జోగులాంబ.. ఇలా నాకు ఇష్టమైన పుణ్యక్షేత్రాలున్నాయి. ఆత్యన్యూనతా భావం, అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునే మంత్రాన్ని నేను కంపోజ్ చేశాను' అని తెలిపారు. 'నిర్మాతలకు కొంత మంది హీరోలతో పని చేయాలని ఉంటుంది. కానీ నాకు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్తో పని చేయాలని ఉంది. అది కేవలం కీరవాణి గారు మాత్రమే. ఆయన మళ్లీ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్. క్రిష్కు థ్యాంక్స్ చెప్పను. ఆయన నా కోసం చేయాల్సింది చేస్తాడు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు' అని నిర్మాత రాజీవ్ రెడ్డి అన్నారు.
కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ వీడియా క్లిప్ ద్వారా మాట్లాడుతూ, 'లండన్లో షూటింగ్ జరుగుతుండటంతో ఈ వేడుకకు రాలేకపోయాను. ఓబులమ్మ పాత్ర నాకు ఎంతో నచ్చింది. కొత్త లుక్కులో చూపించారు. ఓబులమ్మ మీ హదయంలో నిలిచిపోతుంది. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు, నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు క్రిష్కు థ్యాంక్స్. ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది. వైష్ణవ్ తేజ్కు ఎంతో భవిష్యత్తు ఉంది' అని చెప్పారు.
''హరిహర వీరమల్లు' మధ్యలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. పవన్కళ్యాణ్గారు అనుమతించకపోయినా, ఎ.ఎం.రత్నం అంగీకరించకపోయినా, ఇంద్రగంటి, సుకుమార్ ఈ నవలను నాకు పరిచయం చేయకపోయినా, సన్నపురెడ్డి వెంకటరెడ్డి ఈ నవలను రాయకపోయినా ఈ చిత్రం వచ్చేది కాదు. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ సినిమా చేశాం. రాజీవ్కు ఈ నవల చెప్పి, చేద్దామని అంటే.. కథ కూడా అడగలేదు. ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు చేయగలుగుతున్నాను. నేను సినిమా తీసింది అంతా ఒక ఎత్తయితే, పై మెట్టులో పెట్టింది కీరవాణి. ఆయన ఈ చిత్రాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లారు. 'రరు రరు..' అనేది పాట కాదు మంత్రం. కీరవాణి, సిరివెన్నెల అద్భుతమైన పాటలు రాశారు. ఆత్మ న్యూనతా భావం ఉన్న రవీంద్ర అనే యువకుడు.. తనది తాను ఎలా సాధించుకున్నాడు అనేది కథగా రాస్తే.. దాన్ని అందంగా చిత్రీకరించాం. నేను రకుల్ నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నాను. వైష్ణవ్ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వంద ఏళ్లు, వంద సినిమాలతో ఓ గొప్ప నటుడిగా ఉంటావని ఆశిస్తున్నాను' అని దర్శకుడు క్రిష్ అన్నారు.
ఈ కథలో రవీంద్ర అనే కుర్రాడు.. ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా తలెత్తుకుని బతకాలని చెబుతాడు. సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన కథను తెరపైకి తీసుకొచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు. ఇది మీలోని ఒక్కరి కథ. 'రరు రరు రయ్యారనే..' మంత్రం అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నా.
- హీరో వైష్ణవ్ తేజ్