Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్న చిత్రం 'వరుడు కావలెను'. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రమోషన్ను మేకర్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ను విడుదల చేసిన చిత్ర యూనిట్, శనివారం సంగీత్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన అగ్ర కథానాయిక పూజాహెగ్డే మాట్లాడుతూ,'హీరోయిన్ని అతిథిగా ఆహ్వానించడం చాలా అరుదుగా జరుగుతుంది. నన్ను అతిథిగా ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఆ క్రెడిట్ చిన్నబాబు, వంశీలకు దక్కుతుంది. హారికా అండ్ హాసిని నా ఫ్యామిలీ బ్యానర్. కరోనా వల్ల ఎంతో బాధపడ్డాం. కాస్త రిలాక్స్ అవ్వడం కోసం థియేటర్లోనే ఈ సినిమా చూడండి. దర్శకత్వ శాఖలో మహిళలు చాలా తక్కువగా ఉంటారు. మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెరకెక్కించిన మంచి ప్రేమకథా చిత్రమిది. దర్శకురాలిగా సౌజన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. అందరూ ఈ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. ఈ సినిమా మంచి విజయం సాధించి పేరుతోపాటు నిర్మాతలకు మంచి లాభాలు రావాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు.
'సినిమా అవుట్పుట్ ఒక రేంజ్లో వచ్చింది. 'మన కుటుంబం మంచిది' అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో, మా సినిమా బాగా వచ్చిందని అంతే గర్వంగా చెప్పుకుంటాం. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. సినిమా పట్ల ఉన్న మాకు ఉన్న నమ్మకం. సినిమాకు బాగా వచ్చిందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయినా నిర్మాతలు థియేటర్ రిలీజ్ కోసమే వేచి చూశారు. సౌజన్య అక్క ఎన్నో సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూ ఓ మంచి కథ రాసుకుంది. ఈ సినిమాతో దర్శకురాలిగా అవకాశం అందుకుంది. మంచి అవుట్పుట్ కోసం చాలా పోరాడింది. ఈ సినిమా హిట్తో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతంతో మేం మొదటి సక్సెస్ అందుకున్నాం. భూమి పాత్రకు రీతూవర్మ పర్ఫెక్ట్గా సూట్ అయింది. తనతో మళ్లీమళ్లీ పని చేయాలనుంది. చినబాబుగారు, వంశీలతో జర్నీ చాలా అందంగా ఉంటుంది. కథను, సినిమాను ప్రేమించే నిర్మాతలు వీరు. ఇలాంటి నిర్మాతలు ఇండిస్టీకి చాలా అవసరం' అని కథానాయకుడు నాగశౌర్య చెప్పారు.
కథానాయిక రీతూవర్మ మాట్లాడుతూ, 'ప్రేమ, అనుబంధం నేపథ్యంలో పూర్తి కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ కథ నాకు దొరకడం అదష్టంగా భావిస్తున్నా. లక్ష్మీ సౌజన్య మంచి కథతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. మా అందరికీ సూపర్హిట్ సినిమా అవుతుంది' అని అన్నారు.
'కథకు తగ్గ పాటలు, నేపథ్య సంగీతం కుదిరాయి. పాటలన్ని విశేష ఆదరణ పొందాయి. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది' అని సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ చెప్పారు.
నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.