Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా రూపొందిన చిత్రం 'అద్భుతం'. మల్లిక్ రామ్ దర్శకుడు. ప్రశాంత్ వర్మ కథ అందించిన ఈ చిత్రాన్ని చంద్ర శేఖర్ మొగుళ్ళ నిర్మించారు. మహా తేజ క్రియేషన్స్, ఎస్. ఒరిజిల్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సృజన్ ఎరబోలు సహనిర్మాత.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 19 నుంచి డైరెక్ట్గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక శివానీ రాజశేఖర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, 'నటిగా ప్రతి సినిమాలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటా. ఆ క్రమంలోనే ఈ సినిమాలోని పాత్ర కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికి.. ఒకే ఫోన్ నంబర్ ఉంటే ఏమవుతుందనే వినూత్న కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందింది. కామెడీ, సస్పెన్స్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. ఒకే ఫోన్ నెంబర్ ఇద్దరికి ఉండటం వల్ల నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి?, ఒకే ఫోన్ నంబరును ఎలా వినియోగించాం అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
తేజ సజ్జాతో నటించటం చాలా సరదాగా ఉంది. దర్శకుడు మల్లిక్రామ్ తాను అనుకున్న కథని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయటానికి మా దగ్గర్నుంచి మంచి అవుట్ ఫుట్ రాబట్టుకున్నారు. అలాగే రథన్ అందించిన సంగీతం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మంచి కథ, కథానంతోపాటు సంగీతం, నటీనటుల నటన, నిర్మాణ విలువలు.. ఇవన్నీ ఓ అద్భుతమైన సినిమాని చూస్తున్నామనే ఫీలింగ్ని కచ్చితంగా ప్రేక్షకులకు కలిగిస్తాయి. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రతోపాటు ఇంత మంచి సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు.