Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా రామ్మల్లిక్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'అద్భుతం'. నిర్మాత చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్మాత చంద్రశేఖర్ మొగుళ్ల మీడియాతో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాను. అమెరికాలో ఉన్నత చదువులు చదివాను. నాగార్జున, సుమంత్, రాజశేఖర్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్తో పాటు అనేక మంది సెలబ్రిటీలకు ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నాను. సినిమాలపై ప్రేమతో నిర్మాతగా మారాను. నా ఆలోచనలు ఎపుడూ యూనివర్సల్గా వర్కవుట్ అయ్యే విషయాల చుట్టూనే తిరుగుతుంటాయి. నా ఆలోచనకి తగ్గట్టుగా దర్శకుడు రామ్మల్లిక్ ఓ యూనివర్సల్ ప్రాబ్లమ్తో ఉన్న కాన్సెప్ట్ చెప్పాడు. ఒకే ఫోన్ నెంబర్ ఇద్దరికి రావడం, దాని వల్ల జరిగే పరిణామాల నేపథ్యం మీద ఆయన చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఈ కథను చెప్పినదాని కంటే 'అద్భుతం'గా తెరకెక్కించాడు. హీరో తేజ, హీరోయిన్ శివానితోపాటు మిగిలిన ఆర్టిస్ట్లు, టెక్నీషియన్స్ కూడా అద్భుతంగా కుదిరారు. కథలో ఉన్న కొత్తదనం, ప్రేక్షకుల ఊహలను తలక్రిందులు చేస్తూ సాగిన కథనం, ప్రతి సీన్ ఉత్కంఠగా సాగటం వంటి కారణాలతో మా సినిమా ఓటీటీలో ఘన విజయం సాధించడానికి దోహదపడ్డాయి. హాట్స్టార్లో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాని థియేటర్స్లో ఎందుకు విడుదల చేయలేదని అడుగుతున్నారు. ఓటీటీలో సినిమా చూసిన ప్రేక్షకులు 4, 4.5 రేటింగ్ ఇచ్చారు. అలాగే కేవలం 3 రోజుల్లో 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించి రికార్డు సష్టించడం మా సంతోషాన్ని మరింత పెంచింది. ప్రేక్షకులు అందించిన ఈ విజయానందాన్ని వారితో షేర్ చేసుకోవడానికి త్వరలోనే సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నా. ఫ్యామిలీ ఓరియెంటెడ్, ఎమోషనల్, స్ఫూర్తిదాయక కథలు, రిలేషన్స్పై ఉండే సినిమాలను చేయాలనేది నా కోరిక' అని తెలిపారు.