Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా టికెట్ల విషయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరోసారి ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. సినిమా టికెట్లను ఆన్లైన్ చేయడంతోపాటు, అలాగే ఇకపై బెనిఫిట్ షోలు కేవలం స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
'పారదర్శకత కోసం ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదే సమయంలో థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుతెరువు కోసం, కాలానుగుణంగా, సముచితంగా.. దేశంలోని అన్ని రాష్ట్టాల్లో ఉన్నట్లు నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులను ప్రభుత్వం తీసుకుంటున్నట్లు టికెట్ ధరల విషయంలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది' అని చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.