Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'భీమ్లానాయక్'. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలను దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా, సితార ఎంటర్ టైన్మెంట్స్ పతకాంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్.కె.చంద్ర దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట శనివారం విడుదలైంది.
'ప్రముఖ గీత రచయిత స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా 'మీ ఉచ్ఛ్వాసం కవనం...మీ నిశ్వాసం గానం...మీ జ్ఞాపకం అమరం' అనే వాక్యాలతో ఈ పాట ఆరంభమవుతుంది. 'కిందున్న మడుసులకా కోపాలు తెమలవు..పైనున్న సామేమో కిమ్మని పలకడు..దూకేటి కత్తులా కనికరమెరగవు..అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవు'.. అంటూ సాగే ఈ పాట ఈ సినిమాలోని ఓ కీలక సందర్భంలో వస్తుంది. ఆద్యంతం ఆవేదనా భరితంగా సాగిన ఈ పాటకు తమన్ సమకూర్చిన స్వరాలు ఓ వైపు గుండెల్ని పిండేస్తే, మరో వైపు దుర్గవ్వ, సాహితి చాగంటిల గళంతో హదయం బరువెక్కుతుంది. రెండు నిమిషాల ముప్ఫై రెండు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్, రానా, నిత్యమీనన్, సంయుక్త మీనన్ ఈ పాటలో కనిపించిన తీరు ఆసాంతం ఆసక్తికరంగా ఉంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ పాటకు సాహిత్యాన్ని అందించిన రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, 'ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు తగువు లాడుకుంటుంటే, చూడలేని కన్నతల్లి మనోవేదన ఏమిటన్నది ఈ పాట సారాంశం. ఇక్కడ కన్నతల్లి ఎవరో కాదు. 'అడవి తల్లి'. ఇలాంటి ఒక భావన ఈ పాటలో కావాలని దర్శకులు చెప్పిన వెంటనే నేను, సంగీత దర్శకుడు తమన్ ఆలోచనలు సాగిస్తున్న దశలో, గుండెల్ని రంపపు కోతకు గురి చేస్తుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక శబ్ధాన్ని వినిపించారు. దానికి అనుగుణంగా నేను పదాలు కూర్చాను. అలా మా మాటల మధ్యలోనే పాట సిద్ధ మయింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, దర్శకుడు సాగర్, చినబాబు గార్లకు వినిపించటం, వారికి ఎంత గానో నచ్చటం, పాట రికార్డ్ అవ్వటం చకచకా జరిగింది. దీనికి అచ్చంగా పల్లె తనం తొణికిసలాడే గొంతులు సరితూగాయి. నా అదష్టం ఏమిటంటే, ఈ పాట విడుదల అవకముందే, రాసిన వెంటనే మా గురువు గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి వినిపించాను. పాట విన్న వెంటనే ఈ పాట నేనే రాశానా అన్న భావన, ఈ పల్లె భాష నాకెలా తెలుసు అన్న ఆశ్చర్యం నీకు కలగలేదా..? అంత బాగా రాసావు అంటూ మెచ్చుకున్నారు. ఆయన ఆశీర్వదించడం ఒకటైతే, చిత్ర కథానుసారం ఓ కీలక సందర్భంలో, అందరినీ ఒక మంచి భావోద్వేగానికి లోనయ్యేలాంటి ఈ గీతాన్ని రచించే అవకాశం నాకు రావటం మరో అదష్టంగా భావిస్తున్నాను' అని చెప్పారు.