Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా 'నయీం డైరీస్'. నయీంగా వశిష్ఠ సింహ నటించిన ఈ చిత్రాన్ని సీఏ వరదరాజు నిర్మించారు. తన తొలి ప్రయత్నంగా దర్శకుడు దాము బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 10న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా బుధవారం దర్శకుడు దాము బాలాజీ మీడియాతో మాట్లాడుతూ, 'నయీం జీవిత కథతో రామ్ గోపాల్ వర్మ సినిమా చేయాలని అనుకుని, కథ రాసే బాధ్యత నాకు అప్పగించారు. ఆ తర్వాత వర్మ ఆ సినిమా చేయలేదు. చాలా రీసెర్చ్ చేసిన ఈ కథతో సినిమాని తెరకెక్కిస్తే బాగుంటుందని పించింది. నా మిత్రుడైన వరదరాజు నిర్మాణంలో ఈ సినిమాని ప్రారంభించాం. నయీం క్యారెక్టర్లో నటించే వ్యక్తి, అతని వ్యక్తిత్వాన్ని చూపించాలి గానీ ఇమిటేట్ చేయకూడదని అలోచించి వశిష్ట సింహాను సెలెక్ట్ చేసుకున్నాం. లీడ్ రోల్లో వశిష్ట చక్కగా నటించాడు. నయీం మంచి వాడని ఈ సినిమాలో ఎక్కడా చూపించడం లేదు. పోలీసులు, నక్సలైట్లు, రాజకీయ
నాయకులు చేసిన తప్పులతో నయీం నేరస్తుడిగా మారాల్సి వచ్చింది. ఈ మూడు వ్యవస్థల మధ్య నయీం పొరపాట్లు చేసి దుర్మార్గుడిలా తయారయ్యాడు. ఈ సినిమాని మూడు పార్టులుగా చేద్దామని కొంతమంది సూచించారు. అలా అయితే ఎప్పటికీ తేలే వ్యవహారం కాదని ఒకే సినిమాగా చేశాం. ఎందుకంటే నయీం జీవితాన్ని కరెక్ట్గా తీస్తే వెయ్యి సీన్స్ చేయొచ్చు. నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య భీకరమైన పోరు జరుగు తున్న టైమ్లో పోలీసులు నయీంను ఇన్ఫార్మర్గా వాడుకున్నారు. తాను అమితంగా ప్రేమించిన సోదరికి జరిగిన అన్యాయంతో నయీం రాక్షసుడిగా మారాడు. నయీం ఎన్ కౌంటర్లో పోలీసులు చెప్పిన వెర్షన్ని మాత్రమే మీడియా ప్రజలకు చూపించింది. కానీ అసలు జరిగింది వేరు. నేను ఈ సినిమా ద్వారా ఆ తెలియని విషయాలను చూపించబోతున్నాను. ఈ విషయంలో ఇప్పటికే నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయినా ధైర్యంతో సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా తర్వాత మరికొన్ని నక్సలైట్ కథలు తెరకెక్కించాలను కుంటున్నా' అని అన్నారు.