Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జీ 5'... ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా బిబిసి స్టూడియోస్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన ఒక యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మార్పులు చేసి 'గాలివాన' అనే ఒరిజినల్ సిరీస్గా నిర్మిస్తోంది.
ఇందులో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాందినీ చౌదరి, నందిని రారు, చైతన్య కష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర తారాగణం. 50 ఏళ్ళ క్రితం మొదలైన తన కెరీర్లో సాయి కుమార్ బాలనటుడిగా, హీరోగా, ప్రధాన పాత్రధారిగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాగే, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్ కుమార్ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బుల్లితెరపై కూడా విజయాలు అందుకున్నారు. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్ కుమార్ ఓటీటీ కోసం 'షో' చేస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. 'ఇటీవలే ఈ ఒరిజినల్ సిరీస్ చిత్రీకరణ స్టార్ట్ చేసాం. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఒక బ్రిటిష్ షోను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి, తెరకెక్కించడం ఇదే తొలిసారి. ఈ వెబ్ సిరీస్తో బిబిసి రీజనల్ ఎంటర్టైన్మెంట్లోకి అడుగు పెడుతోంది' అని నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్, 'జీ 5' సంస్థలు తెలిపాయి. 'తిమ్మరుసు' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్ సిరీస్కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.