Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కె.ఎమ్ ప్రొడక్షన్స్ పతాకంపై బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'సైదులు'. రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి 'మేజర్' చిత్ర దర్శకుడు శశి కిరణ్తోపాటు దర్శకులు చంద్ర మహేష్, నెలుట్ల ప్రవీణ్ చంద్ర ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శశి కిరణ్ మాట్లాడుతూ, ''సైదులు' సినిమా ట్రైలర్ రియాలిటీకీ చాలా దగ్గరగా ఉంది. ఇలాంటి సినిమాలు ఆడితే, మరిన్ని సినిమాలొస్తాయి. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్' అని చెప్పారు.
'డైరెక్టర్ బాబా చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఆయన ఈ సినిమాను చాలా బాగా తీశారు. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం 1980లో తెలంగాణలోని ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఓ కీలక పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటించారు. సినిమా మంచి విజయం సాధించి డైరెక్టర్కి మంచి పేరుతో పాటు మరెన్నో అవకాశాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను' అని నిర్మాత మరబత్తుల బ్రహ్మానందం తెలిపారు.
డైరెక్టర్ బాబా పి.ఆర్ మాట్లాడుతూ, 'తెలంగాణలో జరిగిన ఒక కథ. ఈ కథను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కించాం. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులు ఎంతో కష్టపడ్డారు. మా అందరి కష్టానికి మంచి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాం' అని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : పి.యస్ మణికర్ణన్, సంగీతం:ఎన్.ఎస్.ప్రసు, లిరిక్స్: ఎమ్. బ్రహ్మానందం, ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, ఆర్ట్:రమేష్, నిర్మాత: మరబత్తుల బ్రహ్మానందం, రచన- దర్శకత్వం : బాబా పి.ఆర్.