Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 153వ చిత్రం 'గాడ్ ఫాదర్'. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మోహన్ రాజా దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. అలాగే అగ్ర కథానాయిక నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ అతిథి పాత్రలో సిల్వర్స్క్రీన్పై మెరవబోతున్నారు. ఈ ప్రత్యేక పేర్ల సరసన తాజాగా యువ కథానాయకుడు సత్యదేవ్ పేరు కూడా ఉండటం విశేషం.
ఈ సినిమాలో సత్యదేవ్ కూడా ఓ కీలకమైన, పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు.
తాను ఎంతగానో ఆరాధించే మెగాస్టార్తో 'ఆచార్య' సినిమాలో స్క్రీన్ని షేర్ చేసుకోవడం పట్ల సత్యదేవ్ సంతోషం వ్యక్తం చేస్తూ, 'అన్నయ్యా.. నటనలో, జీవితంలో మాలాంటి ఎందరికో 'ఆచార్య' మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈరోజు 'ఆచార్య' సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది' అని ట్వీట్ చేశారు. అలాగే చిరంజీవితో దిగిన ఓ ఫోటోని ఆయన అభిమానులతో పంచుకున్నారు.
దీనికి చిరంజీవి స్పందిస్తూ, 'డియర్ సత్యదేవ్ ..థ్యాంక్ యూ. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం. 'ఆచార్య'లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం. 'గాడ్ ఫాదర్' సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం' అని రీట్వీట్ చేశారు.
ఏకధాటిగా జరుపుతున్న షూటింగ్తో ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అలాగే అంతే వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. టాప్ టెక్నికల్ టీమ్ 'గాడ్ ఫాదర్' కోసం పని చేస్తున్నారు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి కళాదర్శకత్వం వహిస్తున్నారు. ఆర్బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు.