Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కొండా' ప్రీ రిలీజ్ వేడుకలో కొండా సురేఖ
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వరంగల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.
కొండా మురళి మాట్లాడుతూ, '''కొండా మురళికి ఏం కష్టం ఉందని అనుకుంటారు. ముంబై మాఫియా, విజయవాడ రౌడీలను వర్మ చూశారు. మాజీ పోలీసులు, నక్సలైట్లను కలిసిన తర్వాత... తెలంగాణలో ఇంత కష్టపడిన మనిషి ఉంటాడా? అని నా జీవితాన్ని సినిమాగా తీస్తానని చెప్పారు. 30 ఏళ్ళ క్రితం నాకు పోలీసులు 50 శాతం, నక్సలైట్లు 50 శాతం సాయం చేశారు. రెండు వర్గాల సాయంతో నేను ఈ స్థాయికి వచ్చాను. ఆర్కే కనుసన్నల్లో నేను ఈ స్థాయికి వచ్చాను. నాకు సాయం చేసినవాళ్లను నేను మర్చిపోను. నా జీవితంలో ఆర్జీవీనీ మర్చిపోను. నా పాత్రలో త్రిగుణ్ బాగా నటించారు' అని అన్నారు.
''కొండా మురళికి జన్మనిచ్చింది కొండా చెన్నమ్మ, కొండా కొమరయ్య అయితే, రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన వంచనగిరి గ్రామ ప్రజలకు, ఓరుగల్లు సోదర సోదరీమణులకు నా హదయపూర్వక నమస్కారాలు. 'కొండా' సినిమా అనేది మన సినిమా. ఇన్ని రోజులు పెత్తందార్లు, పెద్దోళ్ళు సినిమా తీసుకున్నారు. కానీ, ఇప్పుడు మన సినిమా మనం రాసుకోగలిగే రోజులు వచ్చాయి. మన కథ మనం చెప్పే రోజులు వచ్చాయి. 35 ఏళ్ళ క్రితం కొండా మురళి, కొండా సురేఖ ఎలా ఉండేవారు?, ఉద్యమ ప్రయాణం ఏంటి?, కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ ఎదగడానికి కారణం ఏంటి?.. అంటే అణచివేత. ఆ అణచివేత ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. సాయి పల్లవి వస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు కార్పెట్లు వేశారట. కుర్చీలు వేశారట. నేను ముఖ్య అతిథిగా పిలిచిన టీపీసీసీ రేవంత్ రెడ్డిని ఆపారు. దయాకర్ రావు బతుకు మారదా? బతుకంతా భయంతో బతుకుతావా? ఎవరు ఏం చేసినా ఈ ఉద్యమం ఆగదు. కొండా అభిమానులు ఆగరు. కొండా మురళి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటారు. పైసల కోసమో, పదవుల కోసమో కొండా కుటుంబం పాకులాడదు. వాళ్ళ మైలేజ్ కోసం సినిమా తీయలేదు. సినిమా చూశాక కొండా మురళి వరంగల్లో పుట్టినందుకు గర్వంగా ఉందని ప్రజలందరూ ఫీలవుతారు. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని నిర్మాత కొండా సుష్మితా పటేల్ తెలిపారు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ''కొండా మురళి, సురేఖ జీవించిన జీవితాన్ని రెండు గంటల్లో నాకు వీలైనంత బాగా సినిమా తీయడానికి ప్రయత్నించా. ఇవాళ రేవంత్ రెడ్డి అరెస్ట్ తర్వాత పోలీస్ స్టేషన్లో వీడియో చూసి ఉంటారు. కాళికాదేవిలా సురేఖ విశ్వరూపం చూపించారు. ఆవిడ మాటల్లో చూపిస్తే... కొండా మురళి చేతల్లో చూపిస్తారు. రెండూ ముఖ్యమే. మురళి చేతలు, సురేఖ మాటలు కలిస్తే దంపతులు అయ్యారు. నేను ఆశించిన దానికంటే త్రిగుణ్ ఎక్కువ చేశాడు. ఇర్రా మోర్ అద్భుతంగా నటించింది. అభిలాష్ మెయిన్ విలన్ రోల్ చేశాడు. గద్దర్ పాటలు కొన్ని తీసుకున్నాం. డి.ఎస్.ఆర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు' అని అన్నారు.
30 సంవత్సరాల మా జీవిత చరిత్రను రెండున్నర గంటల్లో ఎంతో ఇష్టంతో తీసినందుకు వర్మకి ఏం ఇచ్చుకున్నా మా రుణం తీర్చుకోలేం. అధికారం ఉంటే దయాకర్ రావు ఏం చేస్తారనే దానికి ఉదాహరణ ఈ రోజు రేవంత్ రెడ్డి ఇక్కడికి రాకపోవడం. ఇటువంటి సంఘటనలు మా జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. కొండా మురళి నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ రోజు నేను ఇలా ప్రజల ముందు నిలబడ్డాను. నా జీవిత చరిత్ర వారితో తెరకెక్కింది. సుష్మిత నా బంగారం. నాతో పాటు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది. ఇక ఈ సినిమాలో మురళి గారి పాత్ర పోషించిన త్రిగుణ్ నా కొడుకు లాంటోడు. మా అమ్మాయి కంటే పదేళ్లు చిన్నోడు. మేడమ్ అని మెసేజ్ పెడితే... 'అమ్మ' అని పిలవమని చెప్పా. అప్పట్నుంచి అమ్మ అని పిలుస్తున్నాడు. మురళి గారి పాత్రలో బాగా చేశాడు. నా పాత్రలో ఇర్రా మోర్ కూడా బాగా నటించింది. ఈనెల 23 నుంచి థియేటర్లలో సినిమా చూడండి. 'కొండా' చూశాక... ప్రజల్లో ప్రశ్నించే తత్త్వం వస్తుందని ఆశిస్తున్నాను.
- కొండా సురేఖ