Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికి మధ్య పరిచయం.. అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, వాటి అనుభూతులు, జరిగే సంఘటనలు, సందర్భాలు ... ఇవన్నీ ఎంత కొత్తగా ఉంటే అంతగా మనసును హత్తుకుంటాయి. తాజాగా విడుదలైన 'స్వాతిముత్యం'లోని 'నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా..' పాట కూడా అలానే అనిపిస్తుంది, అందర్నీ ఆకట్టుకుంటుందని చెబుతోంది 'స్వాతిముత్యం' చిత్ర బృందం.
గణేష్ బెల్లంకొండ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. 'వర్ష బొల్లమ్మ' కథానాయిక. లక్ష్మణ్.కె.కష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రేమ పాట 'నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా..'ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. హీరో, హీరోయిన్ గణేష్, వర్ష బొల్లమ్మపై పట్టణం నేపథ్యంలో చిత్రీకరించిన ఈ గీతానికి సాహిత్యాన్ని కె.కె అందించగా, అర్మాన్ మాలిక్, సంజన కాలమంజే శ్రావ్యంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతంలో కొత్త హొయలు పోయిందీ గీతం. గణేష్ మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.
'పాట విడుదలైన క్షణం నుంచే అది ఆకట్టుకుంటున్న వైనం, సామాజిక మాధ్యమాల వేదికగా అందుతున్న ప్రశంసలు సంతోషాన్ని కలిగిస్తున్నాయని చిత్ర దర్శకుడు లక్ష్మణ్ తెలిపారు. 'ప్రతి పాటకు ప్రసవ వేదన ఉంటుంది. ఈ పాట కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఈ పాట కొన్ని పర్యాయాలు రాసిన తరువాతే అందరికీ ఆమోదయోగ్యమైంది. దర్శకుడు చెప్పిన సందర్భానికి, సంగీత దర్శకుడి బాణీలకు, నిర్మాత అభిరుచికి తగినట్లుగా సాహిత్యం అందించటం ఆనందంగా ఉంది' అని గీత రచయిత కె కె. చెప్పారు. 'చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నాం. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రమిది' అని నిర్మాత సూర్య దేవర నాగవంశీ తెలిపారు.